Pawan Kalyan news today telugu(Latest political news in Andhra Pradesh): జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. దౌర్జన్యంతో కూడిన క్రిమినల్ రాచరికమే నడుస్తోందని మండిపడ్డారు. పంచాయతీ వ్యవస్థ బలంగా ఉండగా మళ్లీ సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారు? అని ప్రశ్నించారు. వాలంటీర్లు వైసీపీకి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీల కన్నా తక్కువ జీతం తీసుకుంటూ జగ్గూభాయ్ చేస్తున్న దుర్మార్గాల్లో వాలంటీర్లు భాగం కావద్దని చెప్పటమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇది జనసేనకు-జగ్గూభాయ్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో అలంపురం వద్ద ఆ నియోజకవర్గ నాయకులు, వీర మహిళలతో జనసేనాని సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి దువ్వ మీదుగా తణుకు వరకు ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత తణుకు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనాయకులు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వ విధానాలపై జనసేనాని మరోసారి విమర్శలు చేశారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసినా తాను ఢిల్లీకి వెళ్లని విషయాన్ని గుర్తు చేశారు. జగన్ చెల్లెలు పార్టీ పెడుతుంటే ఎక్కువ మంది రాజకీయాల్లోకి వస్తున్నందుకు సంతోషించానని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేస్తారని వార్తలు వస్తున్నాయని తెలిపారు. పార్టీని నడపడానికి వేల కోట్లు ఉంటే సరిపోదని సైద్ధాంతిక బలం, పట్టుదల ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
శ్రీకాళహస్తిలో సాయి అనే జనసేన కార్యకర్తను సీఐ అంజు యాదవ్ రెండు చెంపలపై కొట్టిన ఘటనపై పవన్ స్పందించారు. పోలీస్ అధికారి కొట్టినా సంయమనం కోల్పోకుండా ఆ కార్యకర్త ఉన్నారంటే అదే జనసేన సిద్ధాంత బలమని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తిని కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిది? అని ప్రశ్నించారు. ప్రాణాల మీద ఆశ లేకుండా పోరాడకపోతే వైసీపీ క్రిమినల్ కోటలను ఎలా కూలదోయగలం? అని అన్నారు. జగ్గూభాయ్కి తన పెళ్లిళ్ల గురించి తప్ప పాలసీల గురించి మాట్లాడే పరిజ్ఞానం లేదని సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. వైసీపీ ఎంపీల నగ్న ప్రదర్శనలు, ఎమ్మెల్యేల గంట, అరగంట కబుర్లు తనకు అవసరం లేదన్నారు.