Telangana employees salary latest news(Telangana News) : బంగారు తెలంగాణ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలివ్వలేకపోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతీ నెలా ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు.. కొన్ని శాఖల్లో మూడో వారానికిగానీ అందని దుస్థితి నెలకొందని విమర్శస్తున్నాయి. జూలై రెండో వారం పూర్తవుతున్నా ఇప్పటి వరకు.. చాలా శాఖల్లోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వనట్లు తెలుస్తోంది.
రాష్ట్ర స్థాయి కేడర్ నుంచి మొదలుకుంటే.. నాలుగో తరగతి, సబార్డినేట్ ఉద్యోగులకు కూడా జీతాలను రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయానికి అందించలేకపోతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వెతలు చెప్పనకర్లేదు. నెలల తరబడి జీతాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
రాష్ట్రంలో 12వేల 769 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో సుమారు 50వేల మంది కార్మికులు ప్రతీ రోజూ విధులు నిర్వహిస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి గ్రామాల్లో నీటి సరఫరా, డ్రైనేజీల క్లీనింగ్ తో పాటు అన్ని పనులు చేస్తున్నారు. వీరి వేతనం మాత్రం 8వేల 500 రూపాయలు మాత్రమే. అవి కూడా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. గత ఆరునెలలుగా వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో ఇండ్లలో పూట గడవని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు ఇటీవల సమ్మె బాట పట్టారు. ప్రతీ ఎంపీడీవో, జెడ్పీ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలుపుతున్నారు.
విద్యుత్, ఆర్టీసీ లాంటి కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఏడాది కాలంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయూస్ జేఏసీ ఆరోపిస్తోంది. ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో.. ప్రతీ నెల రెండూ, మూడు వారాలు ఆగితేగానీ జీతాలు పడని దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు.. సరైన టైంలో కిస్తీలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు.