NIA news today(Current news from India): హైదరాబాద్, ఢిల్లీల్లో భారీ పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన దోషులకు 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ NIA ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు ఢిల్లీ NIA కోర్టు జైలు శిక్ష వేసింది. హైదరాబాద్కు చెందిన ఒబేద్ రహమాన్, బీహార్కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్లను 2013లో NIA అరెస్ట్ చేసింది.
హైదరాబాద్, ఢిల్లీలోని పలు చోట్ల పేలుళ్లకు పాల్పడేందుకు దోషులు రెక్కీ నిర్వహించారని నిర్ధారించారు. ఇందుకోసం ఆయుధాలను సమకూర్చుకున్నట్లు సాక్ష్యాలను సేకరించింది. దీనిపై విచారణ జరిపిన NIA ప్రత్యేక కోర్టు నలుగురిని దోషులుగా తేల్చింది. 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దోషులు దేశంలో పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నారు. గతంలో వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్లలో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల పాత్ర ఉందని దర్యాప్తు అధికారులు తేల్చారు. 2007లో గోకుల్చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్లు, 2013లో దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉందని నిర్ధరించారు. మొత్తం 11మందిని నిందితులుగా జాతీయ దర్యాప్తు సంస్థ NIA చేర్చింది.
నలుగురికి 10 ఏళ్ల శిక్ష పడగా.. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది. శిక్ష పడిన వారిలో దోషి డానిష్ అన్సారీకి 2వేలు, అఫ్తాబ్ ఆలంకు 10 వేల జరిమానా కూడా విధించారు.