Bogatha waterfalls(Latest news in telangana): తెలంగాణ నయాగార జలపాతంగా పిలువబడే బొగత జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతానికి కళ వచ్చింది. పరుగులు పెడుతున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. జలపాతం అందాలను తిలకిస్తూ సెల్ ఫోన్ లో బొగత జలపాతం ఫోటోలను చిత్రీకరించి ఆనందాన్ని పొందుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా.. ఏపీ, ఛతీస్ గడ్ రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో తరలివచ్చిన పర్యాటకులు బొగత జలపాత ప్రాంగణంలో రోజంతా గడిపి విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తున్నారు. జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతున్నా.. అధికారులు మాత్రం పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నది వరద క్రమంగా పెరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం గోదావరి పుష్కర ఘాట్ వద్ద 7.3 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. దీంతో మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ 24 గేట్లు ఎత్తి 70,176 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
మేడిగడ్డ వద్ద ఇన్ ఫ్లో 84,700 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 70,176 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 13.986 టీఎంసిలుగా ఉంది. వారం రోజుల నుంచి ఏడు మోటార్ల ద్వారా ఐదు టిఎంసిల నీళ్లను అన్నారం సరస్వతి బ్యారేజీలోకి తరలిస్తున్నారు.