Yamuna Floods: యుమునా నదీ ప్రవాహం ఢిల్లీని వణికిస్తోంది. 1978 తర్వాత ఉగ్రరూపం దాల్చింది. 1978లో అత్యధికంగా యుమునా నదికి 207.49 మీటర్ల ప్రవాహం వచ్చింది. 45 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసి ఉగ్రరూపం దాల్చింది.
యమునా నదిలో ప్రస్తుతం నీటిమట్టం 207.55 మీటర్లకు చేరింది. రాత్రికి ప్రవాహం 207.77 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది. హర్యానాలోని హాత్ని కుండ్ బ్యారేజ్ నుంచి 1.9 లక్షల క్యూసెక్కుల నీరు యమునా నదిలో చేరుతోంది.
వరద నీరు ఢిల్లీ వీధుల్లోకి చేరింది. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం కనిపిస్తుండగా ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. వరద ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తోంది.
హర్యానా నుంచి నీటి విడుదలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా వర్షాలు లేకపోయినా వరద పెరగడానికి హర్యానా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడమే కారణమని కేజ్రీవాల్ ఫైరవుతున్నారు. నీటిని దిగువకు విడుదల చేయకుండా కేంద్రం ఆపాలని కోరారు. యమునా ప్రవాహం ఢిల్లీకి శుభ పరిణామం కాదని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.