KCR latest news telugu(Telangana today news): జూనియర్ పంచాయతీ కార్యదర్శలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్నవారిని క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారి పనితీరు, మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పంచాయతీ కార్యదర్శులు బాగా పనిచేయడం వల్లే తెలంగాణ పల్లెలు జాతీయ అవార్డులు సాధించాయని ప్రశంసించారు. ఇదేవిధంగా నిత్యం పని చేయాలని సూచించారు. జేపీఎస్ లను క్రమబద్ధీకరణ చేసే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావును ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, మొక్కలు నాటించడం, సంరక్షణ బాధ్యత జేపీఎస్ లకు ప్రభుత్వం అప్పగించింది. మూడింట రెండు వంతుల లక్ష్యాలను చేరుకున్న జేపీఎస్ లను క్రమబద్ధీకరించాలని కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏలను విద్యార్హతలు, సామర్థ్యాల ఆధారంగా ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వీఆర్ఏల అభిప్రాయాలు తీసుకొని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి దిశానిర్దేశం చేశారు. ఈ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉపసంఘం సూచనల మేరకు వీఆర్ఏల సేవలు వినియోగించుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
తెలంగాణ నూతన సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. సచివాలయ ప్రాంగణంలో పునర్నిర్మించిన నల్ల పోచమ్మ ఆలయంతోపాటు మసీదు, చర్చిని వచ్చే నెల 25న ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. సచివాలయ సంఘం కార్యవర్గంతో చర్చించిన ముఖ్యమంత్రి.. హిందూ సంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన చేసి ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ మతాల సంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో మసీదు, చర్చిని ప్రారంభించనున్నారు.