Nara Lokesh : టీడీపీ నేత, యువ నాయకుడు లోకేష్ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. దారి పొడవునా జనం కష్టాలు తెలుసుకుంటూ వారి సమస్యలు తీరుస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు యువనేత లోకేష్. అలాగే పనిలో పనిగా జగన్ సర్కారుపైనా మండిపడుతున్నారు.
తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మరో మైలురాయి చేరుకున్నారు.ఆయనకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా బలంగా, ప్రజాగళంగా ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగిందని తెలుగుదేశం పార్టీ తెలిపింది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ తనదైన శైలిలో వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారని వెల్లడించింది. 152 రోజుల పాదయాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను విన్నారని టీడీపీ చెబుతోంది.
ముఖ్యంగా తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల కోసం టీడీపీని బలోపేతం చేసే దిశగా నేతలందరినీ సమన్వయం చేస్తున్నారు. అలా ఇప్పటివరకు 49 బహిరంగ సభలను లోకేష్ నిర్వహించారు.అలాగే ఏపీలో ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో యువగళం కొనసాగిన పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించి ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నారు లోకేష్. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ పేర్లను అధికారికంగా ప్రకటించారు. నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి, ఆత్మకూరులో ఆనం రాంనారాయణరెడ్డి పోటీ చేస్తారని లోకేష్ తెలిపారు. తాజా పరిణామాలతో గత ఎన్నికల్లో దెబ్బతిన్న నెల్లూరు జిల్లాలో ఈసారి టీడీపీ బలంగా పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ టీడీపీకి గ్రాఫ్ పెరిగిందని వివరిస్తున్నారు.
అటు తాము అధికారంలోకి వస్తే యువత కోసం చేపట్టబోయే కార్యక్రమాలను తన పాదయాత్రలో లోకేష్ వివరిస్తున్నారు. మహానాడులో టీడీపీ అధినేత ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి 100 కి.మీ పాదయాత్ర పూర్తి కాగానే అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరిస్తున్నారు.మరోవైపు ఏపీ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తూ వైసీపీ అధినేత జగన్పై మాటల తూటాలను పేలుస్తున్నారు లోకేష్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నారు.
ఇక తన పాదయాత్ర 2వేల కి.మీ. మైలురాయికి చేరుకున్న నేపథ్యంలో నారా లోకేష్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న పాదయాత్ర కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2వేల కి.మీ. మజిలీకి చేరుకుందన్న ఆయన … దానిని తన జీవితంలో మరపురాని ఘట్టంగా అభివర్ణించారు.