Pawan kalyan latest comments(AP politics) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తమపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ వాలంటీర్లు నిరసనకు దిగారు. పవన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అటు మంత్రులు జనసేనానిపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు నియోజకవర్గ నేతలు, వీర మహిళలతో భేటీ అయిన పవన్.. తనపై వైసీపీ నేతల ఎదురుదాడి చేయడాన్ని తప్పుపట్టారు. తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేకే అలా చేస్తున్నారని మండిపడ్డారు.
ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వాలంటీర్ల వేతనాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల వద్ద ఉందన్నారు. ఆ సమాచారాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు.సేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్లు, ప్రజలపై దాడులు చేస్తారా? అని నిలదీశారు.
మహిళల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించరు? అని జనసేనాని నిలదీశారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిప్డడారు. వైసీపీ నాయకులు తనపై చేసే వ్యాఖ్యలకు తన భార్య కూడా ఏడుస్తోందని పవన్ తెలిపారు.
రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎవరో పెట్టిన పార్టీని వైసీపీ వాళ్లు తీసుకున్నారని విమర్శించారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ వైసీపీ అని అన్నారు. తనను బెదిరించారని, డబ్బుతో మభ్యపెట్టాలని చూశారని పవన్ చెప్పుకొచ్చారు. జగన్ అంటే తనకు కోపం లేదని వైసీపీ ప్రభుత్వ విధానాలనే వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. నాయకులు చేసిన తప్పులు ప్రజలపై ప్రభావం చూపిస్తాయన్నారు.