AP Election Commissioner : ఏపీలో ఓటర్ల జాబితా చాలారోజులుగా వివాదం రేపుతోంది. భారీగా ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రజల నుంచి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేక చోట్ల ఒకే అడ్రస్ పై భారీగా ఓట్లు నమోదైన వివరాలు బయటకొచ్చాయి. ఇందులో ప్రభుత్వ కుట్ర ఉందని విపక్షాలు ఆరోపించాయి.
ఇలా ఓటర్ల జాబితాపై వివాదాలు కొనసాగుతున్న వేళ ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపురావడం ఆసక్తిగా మారింది. దీంతో సీఈసీని కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఢిల్లీకి పిలిచారని సమాచారం.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్థానిక యంత్రాంగం ఇచ్చివచ్చినట్లుగా ఓట్ల చేర్చడం, తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాను ఢిల్లీకి పిలవడం ఆసక్తిని రేపుతోంది.