BRS party latest news(Telugu flash news): యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమవేశాల్లో బిల్లు పెడితే.. వ్యతిరేకిస్తామని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. ఒకడుగు ముందుకేసి.. భావసారుప్య పార్టీలతో కలిసి బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో బీఆర్ఎస్ బాస్ దిట్ట. యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని పక్కాగా వినియోగించుకోవాలని.. సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం ద్వారా ఆయన.. తాను ముస్లిం పక్షాలతో ఉన్నానన్న సంకేతాలిస్తున్నారు.
ఇక పార్లమెంట్ లో ఆ అంశంపై పోరాడాలని తమ పార్టీ పార్లమెంటరీ పక్షానికి ఆదేశాలిచ్చారు. దీంతో ఏకకాలంలో తెలంగాణలోని మైనార్టీ ఓట్లను తనవైపుకు తిప్పుకోవడంతోపాటూ.. జాతీయ స్థాయిలో బీజేపీకి.. తమ పార్టీ బీ- టీం కాదన్న సంకేతాలు పంపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగనున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకూ ప్రజాదరణను పొందుతున్న కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపిస్తోంది. బీజేపీకి ఆ పార్టీ బీ-టీం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇటీవల ఖమ్మంలో విమర్శించారు. తెలంగాణలోని వామపక్షనాయకులు, మేధావులు, ప్రజాసంఘాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బీజేపీకి తాము దూరమని చెప్పడానికి కేసీఆర్ ట్రై చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గిపోతోందని పలు సర్వేలు తేలుస్తున్నాయి. మొన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్.. ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. పరస్పరం విమర్శించుకోవడం తగ్గించాయి. లిక్కర్ స్కామ్ విచారణ ముచ్చటే లేదు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా చేయడానికే.. ఆ రెండు పార్టీలు ములాఖత్ అయ్యాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని పక్కగా వినియోగించుకొని ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది.