YCP Leaders vs Janasena Pawan Kalyan(AP Politics): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి. పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నం తినేవాడెవడైనా వాలంటీర్లను తిడతాడా? అని మరో మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవ చేశారని గుర్తు చేశారు.
పవన్ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు? అని ప్రశ్నించారు. జగన్ గద్దెదించి.. ఎవర్ని గద్దెనెక్కిస్తావో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్ మండిపడ్డారు. జగన్ను ఏకవచనంతో పిలిచే అర్హత జనసేనానికి లేదని స్పష్టం చేశారు.
పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. చంద్రబాబు కాళ్లు మొక్కితే తమకేమి ఇబ్బంది లేదంటూ కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్కు భయం పట్టుకుందన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్కు మంచి పేరు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని సవాల్ చేశారు.
పవన్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. కరోనా సమయంలో పవన్ ఫాంహౌస్లో పడుకున్నారని.. వాలంటీర్ల మాదిరిగా ప్రజలకు సేవ చేయలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ ఎప్పటికీ నటుడే కానీ రాజకీయ నాయకుడు కాలేరని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు విమర్శించారు.