Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేజ్రీవాల్ సర్కార్ కు, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. అధికారాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై కేంద్రం వైఖరిని తెలపాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ సర్కార్ ను ఆదేశించింది. తుదిపరి విచారణ జులై 17 వాయిదా పడింది.
ఐఏఎస్లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న స్పెషల్ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.
కేంద్రం చర్య కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంది. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధికారాలను ఈ ఆర్డినెన్స్ దూరం చేస్తోందని తన పిటిషన్లో స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ను రద్దు చేసి మధ్యంతర స్టే విధించాలని పిటిషన్లో పేర్కొంది. ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ ఇప్పటికే ఆయా రాష్ట్రాల సీఎంలు, పార్టీ నేతలను కలిసి మద్దతు కోరారు.