Rangam: సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన రంగం కార్యక్రమంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తుల నుంచి పూజలు సంతోషంగా అందుకున్నానని తెలిపారు. గతేడాది ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారని చెప్పారు. కావాల్సిన బలాన్నిచ్చానని స్పష్టం చేశారు. ప్రజల వెంటా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆలస్యమైనా వర్షాలు వస్తాయని చెప్పారు.
అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు భయపడవద్దు జోగిని స్వర్ణలత సూచించారు. ప్రజలను కాపాడే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. 5 వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలని కోరారు. రంగం కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అలాగే భవిష్యవాణి వినేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. రంగం కార్యక్రమం జరుగుతున్న సమయంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు , బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన తర్వాత సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.