Ponguleti latest news(Political news today telangana): ఖమ్మంలో బీఆర్ఎస్ అరాచకాలు కొనసాగుతున్నాయి. మొన్నటి ఖమ్మం సభ నుంచి మొదలైన అధికార పార్టీ దాష్టీకాలు ప్రతిపక్ష నేతలపై ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ సభ నిర్వహించినా జనం రాకుండా అడ్డుకునేందుకు వీలైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తుమ్మలగడ్డ మసీదు ప్రాంతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన సభకు కూడా మైనార్టీలు రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అడ్డుకున్నారు. ఏదో కారణం చెప్పి వాహనాలను సీజ్ చేశారు.
మొన్నటి ఖమ్మం సభ సమయంలో కూడా వందలాది వాహనాలను సభ వరకు వెళ్లకుండానే అడ్డుకున్నారు. దీంతో వేలాదిగా జనం సభకు రాలేకపోయారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేపింది. వాహనాలను అడ్డుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీకి కూడా కంప్లైంట్ చేశారు. అయినా ఖమ్మంలో మాత్రం అధికారులు తీరు మారడం లేదు.
ఈ విషయంలో మొదటి నుంచి పొంగులేటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం తన సభలకు వచ్చే ప్రజలను అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభలకు జనం లేకుండా చేయడం ద్వారా విజయవంతం కాలేదనే ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. అధికార బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా తన సభలకు జనం రాకుండా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అయితే ఖమ్మంలో పొంగులేటితో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరడంతో అధికార బీఆర్ఎస్ గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు గానూ పదింటిలో కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుందని పలు సర్వేల్లో వెల్లడి కావడంతో బీఆర్ఎస్ కు మింగుడుపడటం లేదనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ హవాను తగ్గించేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.