Congress party news today(Political news in telangana): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోంది. చాలా మంది నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం గూటికి చేరారు. మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారు. పాలమూరు జిల్లాలో MLC కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వబోతున్నారు.
దామోదర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైంది. ఇన్నాళ్లూ ఆయన కుమారుడు రాజేష్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని మాత్రమే అనుకున్నారు. కానీ కొల్లాపూర్లో జరిగే ప్రియాంక గాంధీ సభలో ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రాజేష్రెడ్డి తోపాటు ఆయన తండ్రి, MLC దామోదర్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది.
తాజాగా నాగర్ కర్నూల్లోని కొల్లాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి దర్శనమిచ్చారు. కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్లో ఆయన చేరిక ఖాయమని తేలిపోయింది.
కాంగ్రెస్ లో చేరికపై దామోదర్ రెడ్డి కూడా స్పష్టత నిచ్చారు. తాను కారు దిగుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్లో తన ఇబ్బందులు చెప్పుకునేందుకు కూడా స్వేచ్ఛ లేదన్నారు. విలువలు లేని చోట ఉండలేనని తెలిపారు. అందుకే ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరతానని ప్రకటించారు.