Telangana BJP news today(TS politics) : ఆయన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు. బీజేపీలో చేరి రెండున్నర ఏళ్లు అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. పార్టీలో ప్రాధాన్యం అంతంత మాత్రమే. తాజాగా వరంగల్ లో జరిగిన మోదీ సభలో పాల్గొనేందుకు కనీసం పాస్ కూడా ఆయనకు రాలేదు. ఇది కాషాయ పార్టీలో మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.
ఎ.చంద్రశేఖర్ బీజేపీకి గుడ్ బై చెబుతారన్న వార్త తెలియగానే ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ఎ.చంద్రశేఖర్ నివాసానికి వెళ్లారు. ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రేశేఖర్ కు సూచించారు.
బీజేపీలో తనకు ఎదురైన ఇబ్బందులను చంద్రశేఖర్ కూడా చెప్పుకున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లు దాటినా ఇప్పటికీ తన ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.
చంద్రశేఖర్, తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని ఈటల తెలిపారు. తమకు ఉమ్మడి ఎజెండా ఉందని వివరించారు. కేసీఆర్ను గద్దె దించడం కోసం కలిసి పనిచేస్తామని ఈటల స్పష్టం చేశారు. వరంగల్ రీజియన్ వరకే ప్రధాని మోదీ మీటింగ్ జరిగిందన్నారు. అందువల్లే ఎ. చంద్రశేఖర్కు పాస్ రాలేదని వివరణ ఇచ్చారు.
పార్టీ బలోపేతంపైనే ఈటల తాను చర్చించామని చంద్రశేఖర్ చెప్పారు. పార్టీ బలపడాలంటే ఏం చేయాలో చెప్పానన్నారు. మొత్తంమీద అలకబూనిన చంద్రశేఖర్ ను బుజ్జగించేందుకు ఈటల ప్రయత్నించారు.