Uttarakhand : ఉత్తరాఖండ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకుల వెహికిల్ బోల్తా పడింది. విరిగిపడిన కొండచరియలను తప్పించుకునే క్రమంలో ఆ వాహనం నదిలోకి దూసుకెళ్లింది.
ప్రమాదానికి గురైన వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఐదుగురిని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. గల్లంతైన మరో ఆరుగురి పర్యాటకుల కోసం గాలింపు చేపట్టారు.
ఈ వాహనంలో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు కూడా ఉన్నారు. రాజాం మండలం బొద్దాంకు చెందిన రవి రంగారావు దంపతులు హైదరాబాద్ నుంచి పర్యటనకు వెళ్లారని సమాచారం. వాహనం నదిలో దూసుకెళ్లిన తర్వాత రవి రంగారావు భార్యను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. అయితే రవి రంగారావు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చివరకు ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.