Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ లు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లపై మోకాళ్లలోతు నీరు నిలిచింది.
ఢిల్లీలో వర్షాలు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల మధ్య ఏకంగా 151 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. 2013 జులై 21న అత్యధికంగా 124 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడీ రికార్డ్ బ్రేక్ అయ్యింది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా వర్షం దంచికొడుతోంది.
ఇక హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి దారుణంగా మారింది. కుంభవృష్టి వర్షాలతో నదులు ఉప్పొంగగా.. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పార్క్ చేసిన కార్లు కొట్టుకుపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందా భయంలో ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ వాసులు.
గతనెల 24న హిమాచల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పటి నుంచి ఇక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే వర్షాల దెబ్బకు అతలాకుతలమవుతున్న ప్రజలకు భారత వాతావరణశాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని.. కొండచరియలు సైతం విరిగిపడే అవకాశం ఉందని తెలిపింది.
IMD హెచ్చరికలతో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ చేసే వారు జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఇప్పటికే చెట్లు కూలిపోవడం.. కొండ చరియలు విరిగిపడటంతో నేషనల్ హైవే 105పై రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కేరళలోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల కారణంగా 10 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 227 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.