Gauri Puja : భారతీయ సమాజంలో వివాహమహోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలతో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఒకప్పుడు వివాహ ప్రక్రియలో 35 రకాల కార్యక్రమాలు ఉండేవి. అవన్నీ భక్తితో ఆచరించేవారు. ఇప్పుడు వివాహాలన్నీ ఒక వేడుక కార్యక్రమాలు మారిపోయాయి. పూజలన్నీ నామ మాత్రంగా జరుగుతున్నాయి. పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశామన్నదే చూసుకుంటున్నారు. పద్దతులు, పూజలు అన్నీ మారిపోయాయి. కళ్యాణ సమయంలో పెళ్లికి ముందు వధువుతో గౌరీ పూజ చేయించే ఆచారం ఉంది. ఇది ఈనాటి విధానం కాదు. దీని వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిల పాణి గ్రహణం జరగడానికి ముందు ఆమె గౌరీ పూజను ఆచరించిందని పురాణాలు ఘోషిస్తున్నాయ్.
ఒంటి నిండా విభూదితో ఒళ్లంతా విష నాగులతో స్మశానంలో ఉండే శివుడితో కలిసి ఉండటానికి పార్వతి దేవికి చాలా ఓపిక ఉండాలి. అలాంటి ఓపిక కేవలం గౌరీ దేవి అయిన పార్వతి మాత మాత్రమే ఇవ్వగలదు. భవిష్యత్ లో భర్తతో చక్కగా కాపురాన్ని నిర్వహించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నవ వధువుతో గౌరీ పూజ చేయిస్తుంటారు. ఎంత కష్టం వచ్చినా ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా, నిత్యం భర్త సంక్షేమం కోరుతూ పరితపించే తల్లి గౌరీ దేవి.. అంత ఓపిక తనకు ప్రసాదించమని కోరుతూ పెళ్లి కూతురు గౌరీ పూజ చేసే సంప్రదాయం తీసుకొచ్చారు. పెళ్లికి ముందు ఘోర తపస్సు చేసి ఆదిశంకరుడ్ని భర్తగా పొందింది పార్వతీ దేవి. ఆమెను ఆదర్శంగా తీసుకుని తన జీవితాన్ని కూడా సాఫీగా చక్కగా జరిగేలా చూడాలని కోరుతూ నవ వధువుతో గౌరీ పూజను చేయిస్తుంటారు.
దంపతుల మధ్య అన్యోన్యత ఉండేలా ఆశీర్వదించమని ఆ తల్లిని కోరుకుంటారు.
తమిళ ప్రజలు, తెలుగు వారు మాత్రమే ఈ సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. పెళ్లికి ముందు పెళ్లికూతురుతో గౌరీ పూజ చేయిస్తుంటారు. పెళ్లి తర్వాత అంతకు ముందు ఎరుగునివ్యక్తితో కలిసి అత్తింట అడుగుపెడుతుంది ఆ యువతి. కొత్త ఇంట్లో ఒక్కోసారి సమస్యలు రావచ్చు. ఎవరు ఎన్ని మాటలన్నా ఓపికతో సహనంతో భరిస్తుంది. కానీ భర్త నిర్లక్ష్యం చేసినా నిరాధరణ చూపించినా ఆమె తట్టుకోలేదు. చెప్పుకోవడానికి ఎవరూ లేకపోయినా ఆమెకు అండగా ధైర్యంగా నిలబడేందుకు గౌరీ మాత ఎప్పుడు సిద్దంగా ఉంటుంది.