Thiruvengadamudaiyan Temple : తమిళనాడులో పురాతన ఆలయాలకి లెక్కే లేదు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన గుడులు, గోపురాలు లెక్కకి మించి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి తేన్ తిరుపతి. ముఖ్యంగా తిరుమల తిరుపతికి వెళ్లలేని భక్తులు తేన్ తిరుపతికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు . సుమారు ఐదు వందల ఏళ్ల నాటి తిరు వెంగడముడయాన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ గుడినే తేన్ తిరుపతికూడా భక్తులు పిలుస్తారు. కారణం తిరుమలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆలయాన్ని నిర్మించడమే .
శ్రీవారి భక్తుడి కోరిక మేరకు స్వామి ఆదేశానుసారం ఒక భక్తుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. స్వామి కలలో సూచించిన ప్రాంతంలో పెరుమాళ్ విగ్రహం దొరకడం..కేవలం పెరుమాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అప్పట్లో భక్తులు ఇష్టపడలేదట. అందుకే శ్రీదేవి-భూదేవిలతో ఆలయాన్ని స్థాపించారు.ఈ ఆలయ పనులు ప్రారంభించే ముందు తిరుపతి నుంచి శఠారి, అగ్నిని తిరుమాయం నుంచి తీసుకొచ్చారట. అందుకే ఈ ప్రాంతాన్ని తేన్ తిరుపతిగా పిలుస్తారు. అంటే దక్షిణ తిరుపతిగా భావిస్తుంటారు. తమిళనాడులో శ్రీరంగం తర్వాత తేన్ తిరుపతి అతి ముఖ్యమైన ఆలయంగా భక్తులతో పూజలందుకుంటోంది. సంప్రదాయ ఆలయాలతో పోల్చితే ఇది భిన్నమైన ఆలయం. గరుడ వాహనం గరుడాళ్వార్ రెండు సింహాలతో దర్శనమిస్తుంది. జూలై-ఆగస్టు మధ్యలో స్వాతి నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు
ఉత్సవ విగ్రహాలను శ్రీరంగం ఆలయం ఇచ్చిందని చరిత్ర చెబుతోంది. చెట్టినాడు ప్రాంతంలో ఏడు అంతస్థుల్లో 120 అడుగుల రాజగోపురం ఉన్న పెద్ద విష్ణు ఆలయంగా ఘనత సాధించింది. ఆలయ పైభాగాన్ని చెక్కతో చాలా అందంగా తీర్చిదిద్దారు . ఈ ఆలయానికి ఉన్న రెండు గోపురాలు ఒకదానికి మించి ఒకటి అన్నట్టు ఉంటాయి. ఇక్కడ స్వామిని ఒక్క సారి దర్శిస్తే సంతాన సమస్యలు, పెళ్లి సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం. ఏటా 15 రోజులపాటు జరిగే వైకాసి ఉత్సవాలకి లక్షలాది భక్తులు తరలివస్తుంటారు.