Pawan Kalyan varahi tour updates(Latest political news in Andhra Pradesh): జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వారాహి యాత్ర 2.0 జులై 9న ఏలూరులో ప్రారంభం కానుంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రెండో విడత యాత్రపై పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తో జనసేనాని చర్చించారు. వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు చేశారు.
ఏలూరులో జులై 9న సాయంత్రం సభ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు ఏలూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో పవన్ కల్యాణ్ భేటీలు నిర్వహిస్తారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది.
జనసేనాని జూన్ 14న వారాహి యాత్రను అన్నవరం నుంచి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను చుట్టేశారు. కాకినాడ, మమ్ముడివరం, అమలాపురం, రాజోలు, మలికిపురం, నర్సాపురం, భీమవరం వరకు ఈ యాత్ర సాగింది. బహిరంగ సభల్లో ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో జనసేనాని విమర్శలు చేశారు. ఈ విమర్శలపై వైసీపీ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. పవన్ తొలి విడత వారాహి యాత్ర సమయంలో మాటల యుద్ధం నడిచింది.
ఇప్పుడు రెండో విడత వారాహి యాత్రను ఏలూరు జిల్లాలో చేపట్టేందుకు జనసేనాని రెడీ అయ్యారు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇక్కడ 34 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదని పవన్ పదే పదే చెబుతున్నారు. ఈ లక్ష్యంతో వారాహి యాత్ర ఈ జిల్లాల్లోనే చేపడుతున్నారు.