Healthy Teeth: మనకు తెలిసినా, తెలియకపోయినా.. మనిషి శరీరంలోని ప్రతీ భాగం, ప్రతీ అవయవం మరో అవయవానికి కనెక్టింగ్గానే ఉంటుంది. ఒక అవయవం అనారోగ్యానికి గురయితే ఆటోమేటిక్గా మరో అవయవంపై ప్రభావం పడుతుంది. ఇలా మనకు తెలియని ఎన్నో కనెక్షన్స్ మన శరీరంలోనే దాగి ఉంటాయి. ఆ కనెక్షన్స్ గురించి తెలుసుకోవడానికే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు. తాజాగా పళ్ళ ఆరోగ్యం సరిగా ఉంటే మానసిక ఆరోగ్యం సరిగా ఉంటుందని ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.
పళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవడం అందరి బాధ్యత. కానీ ఒక్కొక్కసారి మనుషులు తీసుకునే మామూలు జాగ్రత్తలు పళ్ళ ఆరోగ్యాన్ని డిసైడ్ చేయాలేవని వైద్యులు చెప్తుంటారు. అంతే కాకుండా చిగుళ్ళ సమస్యలు, పళ్ళు ఊడిపోవడం లాంటి సమస్యలు అనేవి నేరుగా మెదడుపై ప్రభావం చూపిస్తాయని తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. మెమోరీ, అల్జీమర్స్ వంటి వ్యాధులకు కూడా ఇవి కారణమవుతాయని వారు అంటున్నారు. అయితే నేరుగా పళ్ళ సమస్యలకు, అల్జీమర్స్కు సంబంధం లేకపోయినా.. ఈ రెండిటికి కామన్ పాయింట్ ఉంటుందని మాత్రం వారు తేల్చారు.
పళ్ళకు, మెదడులో ఏర్పడే అల్జీమర్స్, డిమెన్షియా లాంటి సమస్యలకు సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పళ్ళ సమస్యలు అనేవి మెదడులో ఆలోచన శక్తిపై, మెమోరీపై ప్రభావం చూపిస్తాయని అన్నారు. చాలామంది పళ్ళ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అయినా వారు పళ్ళ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఈ పరిశోధనల కోసవ 67 ఏళ్ల వయసు ఉన్న 172 మందిని వారు సెలక్ట్ చేసుకున్నారు. ముందుగా వారి మెదడును స్కాన్ చేసి, పళ్ళ ఆరోగ్యం గురించి సమాచారం తీసుకున్నారు. అప్పటికి వారికి పళ్ళ సమస్యలు కానీ, మెదడుకు సంబంధించిన సమస్యలు కానీ ఏమీ లేవు.
నాలుగేళ్ల తర్వాత మరోసారి ఈ 172 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో పళ్ళు ఊడిపోయిన వారికి, చిగుళ్ల సమస్యలు వచ్చినవారికి మతిమరుపు లాంటిది కూడా వచ్చిందని శాస్త్రవేత్తలు గమనించారు. వారి పరిశోధనల ప్రకారం ఒక్క పన్ను ఊడిపోయినా.. బ్రెయిన్ ఏజ్ ఒక సంవత్సరం వరకు తగ్గిపోయినట్టే అని తెలుస్తోంది. అందుకే చిగుళ్ల విషయంలో, పళ్ళ ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ లింక్ వల్ల కలుగుతున్న సమస్యలకు పరిష్కారం ఏంటని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తామన్నారు.