Narendra Modi news telugu(Telangana BJP news today): ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు మోదీ. శనివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9 గంటల 50 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు వరంగల్ హెలిప్యాడ్కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు వరంగల్ హెలిప్యాడ్కు చేరుకుని.. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు ప్రధాని మోదీ.
ఓరుగల్లులో జరిగే మోదీ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కమలనాథులు. జనసమీకరణకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంచార్జీని నియమించింది రాష్ట్రపార్టీ. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాలకు ఇద్దరి చొప్పున బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గ బాధ్యులు.. జనసమీకరణకు సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నేతలను ఆదేశించారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సమస్యలుంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికీ తేవాలి కానీ.. పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కిషన్రెడ్డి.
ఈనెల 8న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ.. కాజీపేటలో వాగన్ ఓవర్ హాలింగ్, టెక్స్టైల్ పార్క్, జాతీయరహదారులకి శంకుస్థాపన చేయనున్నారు. అధికార కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. హనుమకొండ సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు మోదీ.
కర్ణాటక ఫలితాల అనంతరం తెలంగాణ బీజేపీలో కల్లోలం నెలకొంది. పార్టీ శ్రేణులను కర్నాటక ఫలితాలు గందరగోళానికి గురి చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు విశ్వసిస్తున్న సమయంలో.. ఆఫ్ ద రికార్డుల పేరిట నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ సభతో.. నిరాశలో ఉన్న పార్టీశ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతుందని భావిస్తున్నారు కమలనాథులు. కేంద్రమంత్రి కిషన్రెడ్డిని.. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సభకావడంతో.. మోదీ సభను విజయవంతం చేయడానికి అన్ని చర్యలు చేపట్టింది రాష్ట్ర నాయకత్వం.
దాదాపు రెండేళ్లుగా ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈసారి ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారా.. లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ పలు సందర్భాల్లో తెలంగాణలో పర్యటించారు. అధికారిక కార్యక్రమాల కూడా మోదీని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లలేదు. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించినా.. కేసీఆర్ మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మోదీ అధికారిక పర్యటనల్లో.. మంత్రి తలసాని శ్రీనివాస్ కలిసి వీడ్కోలు పలికారు.
ఈ నెల 8న మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. ప్రధాని అధికారిక పర్యటనకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా.. లేదా.. అనే దానిపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఈసారి ప్రధాని మోదీతో కేసీఆర్ వేదిక పంచుకుంటారా.. హకీంపేట విమానాశ్రయానికి వెళ్లి.. మోదీకి స్వాగతం పలుకుతారా.. అనేది చర్చనీయాంశంగా మారింది. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ సారి సీఎం కేసీఆర్ పక్కాగా హాజరవుతారని కొందరు.. ఏదో ఒక సాకుతో ఈ సారి కూడా కేసీఆర్ పాల్గొనరని కొందరు చర్చించుకుంటున్నారు.