BJP: కర్నాటక ఫలితం బీజేపీని షేక్ చేస్తోంది. విపక్షాల ఐక్యత సైతం కమలనాథులను కంగారు పెట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించడం.. కాషాయదళంపై పిడుగులా పడింది. అదే జరిగితే.. రిజల్ట్స్ రచ్చ రంబోలే. కాంగ్రెస్కు అధికారమే..అంటున్నారు.
ఆ ఊహనే తట్టుకోలేకపోతోంది బీజేపీ. ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ పాలిటిక్స్ చేస్తోంది. పాత మిత్రుడైన చంద్రబాబును మళ్లీ అక్కున చేర్చుకోబోతోంది. పవన్ కల్యాణ్ పార్టీతో కలిసి త్రికూటమికి సిద్ధమవుతోంది. అటు తెలంగాణలోనూ స్ట్రాటజీ మార్చేసింది. ఇన్నాళ్లూ బీఆర్ఎస్పై అటాకింగ్ గేమ్ ఆడిన కమలం పార్టీ.. ఇప్పుడు డిఫెన్స్ గేమ్ ప్లే చేస్తోంది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీయే తమకు మెయిన్ టార్గెట్ అంటూ.. టార్గెట్ను హస్తం గుర్తు వైపు షిఫ్ట్ చేసింది. అధ్యక్షుడు బండి సంజయ్ను మార్చేసి.. కిషన్రెడ్డిని నియమించి.. కేసీఆర్తో ఫ్రెండ్లీ ఫైట్ స్టార్ట్ చేసింది. తెలంగాణ రాజకీయంపై క్లారిటీ వచ్చేశాక.. ఇక ఏపీపై ఫుల్ ఫోకస్ పెంచింది బీజేపీ.
ఇప్పటికే సోము వీర్రాజును కుర్చీ నుంచి దించేసి.. టీడీపీని సాఫ్ట్గా డీల్ చేసే పురందేశ్వరికి పట్టం కట్టింది పార్టీ. ఇక లేటెస్ట్గా ఈ నెల 18న ఢిల్లీలో తలపెట్టిన.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీకి సైతం టీడీపీని ఆహ్వానించబోతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో ఎన్డీయేను వీడిన టీడీపీని.. మళ్లీ ఫ్రెష్గా ఇన్వైట్ చేయడం రాజకీయంగా అత్యంత ఆసక్తికర విషయం. టీడీపీతో పాటు అకాలీదళ్ను సైతం పిలుస్తున్నారట. చిరాగ్ పాశ్వాన్కు సైతం వెల్కమ్ చెబుతున్నట్టు టాక్.
అదే 18న.. బెంగళూరులో విపక్షాల సమావేశం ఉంది. ఆ డేట్ను ముందే ప్రకటించాయి ప్రతిపక్షాలు. సరిగ్గా అదే రోజున.. ఎప్పుడో అటకెక్కించిన ఎన్డీయేను బయటకు తీసి.. బూజు దులిపి.. మళ్లీ కొత్తగా ముస్తాబు చేసేలా ముహూర్తం ఫిక్స్ చేసింది బీజేపీ. మరి, ఆ మీటింగ్కు టీడీపీని పిలిస్తే.. వైసీపీ ఫ్యూచర్ ఏంటనే చర్చ నడుస్తోంది ఏపీలో. ఎన్నికల నాటికి మరింత కీలక రాజకీయ పరిణామాలకు తెరలేచినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.