Telangana: బండలాంటి.. బండి సంజయ్ను తప్పించారు. మెతకైనా.. కిషన్రెడ్డికి బీజేపీ పగ్గాలు కట్టబెట్టారు. వద్దు వద్దంటున్నా.. వదలకుండా కిరీటం పెట్టేశారు. పార్టీ బరువంతా ఆయన మీద మోపేశారు. ఏదో తేడాగా ఉంది. అంతా అనుమానంతోనే ఉన్నారు. అదేంటి.. అంతటి తోపులీడర్ బండి సంజయ్ను కాదని.. ఇంతటి సాఫ్ట్లీడర్ కిషన్రెడ్డిని కేసీఆర్ మీదకు ప్రయోగించడం ఏంటని సందేహిస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు.
బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్ అని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఈ ఆరోపణను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. బీజేపీ సైతం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలాగే చేస్తోంది. కవిత అరెస్ట్ కాకపోవడం ఆ పార్టీ చిత్తశుద్ధిని శంకించేలా చేసింది. ఇప్పుడు అధ్యక్ష మార్పు మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. కేసీఆర్ మీద బలంగా పోరాడుతున్న బండి సంజయ్ను తప్పించడం.. కేసీఆర్తో క్లోజ్గా ఉండే కిషన్రెడ్డికి.. ఎన్నికల వేళ పార్టీ బాధ్యతలు అప్పగించడం వెనుక సంథింగ్ సంథింగ్ అంటూ పొలిటికల్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్ అంటే ‘కిషన్ చంద్రశేఖర్ రెడ్డి’.. అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అంటే, వాళ్లిద్దరూ వేరు వేరు కాదనే మీనింగ్లో పోస్టులు పెడుతున్నారు. అవి బాగా వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్గా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై చర్చలు చేశారని.. కేటీఆర్ సూచన మేరకే.. జేపీ నడ్డా.. బండి సంజయ్ను మార్చేసి.. కిషన్రెడ్డిని నియమించారని చెప్పారు. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం అన్నారు రేవంత్రెడ్డి.
మరోవైపు, బీఆర్ఎస్ టెక్సెల్ సైతం బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వదులుతోంది. కేసీఆర్తో పెట్టుకున్నందుకే బండి సంజయ్ పోస్ట్ ఊడింది అనేలా పాత స్పీచ్లను కొత్తగా వైరల్ చేస్తోంది. కేసీఆర్తో పెట్టుకుంటే ఇట్లుంటది అంటూ.. బీఆర్ఎస్ టెక్సెల్ ట్వీట్ చేసింది. కేసీఆర్ పాత ప్రసంగానికి బండి తలపట్టుకున్న ఫోటో పెట్టి వీడియోలు రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ అఫిషియల్ పేజ్లోనే ఇలాంటి వీడియోలు రావడంతో.. బండిపై వేటు వెనుక కేసీఆర్ హస్తం ఉందా? ఫైర్ బ్రాండ్ను తప్పించి.. మిస్టర్ కూల్ కిషన్రెడ్డిని గులాబీ బాసే ఆ సీట్లో కూర్చోబెట్టేలా చేశారా? రేవంత్ ఆరోపించినట్టు.. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను మేనేజ్ చేశారా? నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమా? ఇలా ఆసక్తికర చర్చ నడుస్తోంది తెలంగాణలో.