Social Media : సోషల్ మీడియాలో ఆసక్తికర పోరు నడుస్తోంది. అయితే అది యూజర్ల మధ్య మాత్రం కాదు. వాటిని సృష్టించి అధిపతులుగా చెలామణి అవుతున్న బిగ్షాట్స్ మధ్య జరుగుతోంది ఈ వార్. ఈ కొత్త బిజినెస్ వార్కు తెరలేపారు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ బిజినెస్ టార్గెట్గా కొత్త అస్త్రం సంధించారు మార్క్ జుకర్ బర్గ్. ట్విట్టర్కు గట్టిపోటీ ఇచ్చేలా థ్రెడ్స్ యాప్ను మార్కెట్లోకి వదిలారు. ట్విట్టర్కు పోటీగా థ్రెడ్స్ యాప్ను రంగంలోకి దింపారు. ట్విట్టర్కు మించి ఫీచర్స్తో ఎంట్రీ ఇచ్చారు జుగర్బర్గ్. దీనికి యూజర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. థ్రెడ్స్ యాప్ వైపు యూజర్లు భారీగా మళ్లుతున్నారు.
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లాక భారీ మార్పులు చేయడం.. రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. మస్క్ కొత్త నిబంధనలతో ట్విట్టర్ యూజర్లు విసుగెత్తిపోయారు. బ్లూటిక్ కావాలంటే సబ్ స్క్రిప్షన్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డబ్బులు కట్టనివారికి బ్లూటిక్ను తొలగించారు. అనేక మంది సెలబ్రిటీలు ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. పెద్దఎత్తున దుమారమే రేగగా.. కాస్త వెనక్కి తగ్గిన మస్క్..1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీలకు ఫ్రీ అకౌంట్ ఇచ్చారు.
తాజాగా మరో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. సబ్ స్క్రిప్షన్ లేకుంటే రోజుకు 600పోస్టులే చూసేలా కండిషన్ పెట్టారు. ఇలా ఎలాన్ మస్క్ పూటకో నిర్ణయం తీసుకుంటుండంతో యూజర్లు బైబై చెబుతున్నారు. దీనికి పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్ వైపు మళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. యాప్ ప్రారంభించిన 2 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో డౌన్లోడ్స్ అయ్యాయి. 2 గంటల్లోనే రెండు మిలియన్లు, 4 గంటల్లో 5 మిలియన్లు, 7 గంటల్లో కోటి మంది యూజర్లు థ్రెడ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అంతేకాదు ఈ యాప్ కు ట్విట్టర్ కిల్లర్గా నామకరణం చేశారు.
సామాజిక మాధ్యమంగా ట్విట్టర్ చాలా పాపులర్ అయింది. సెలబ్రెటీలతోపాటు కామన్ పీపుల్ కూడా ట్విట్టర్ యూజర్లుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ న్యూస్ తెలుసుకోవాలన్నా ట్విట్టర్లో క్షణాల్లో తెలిసిపోతుంది. అలాగే మనసులో మాటను బయటపెట్టాలన్నా.. పొలిటికల్ సెటైర్లైనా.. ఇలా ఏ అభిప్రాయమైనా సోషల్ మీడియా దిగ్గజంతో ప్రపంచానికి చెప్పేయొచ్చు. అయితే ఈ పెత్తనంపైనా అనేక విమర్శలు వచ్చాయి. పాలిటిక్స్లో ట్విట్టర్ వేలు పెడుతోందనే వివాదాలు కూడా నడిచాయి. అయితే ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ పగ్గాలు వచ్చిన తర్వాత వార్తలు చేరే వేసే ప్రచార మాధ్యమం కాస్తా రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఎలాన్ మస్క్ ఎంత చెబితే అంతే అనేలా పరిస్థితులు మారుతున్నాయి.
ట్విట్టర్ను మస్క్ ఆదాయ వనరుగానే చూస్తున్నారు. ఎన్ని కండిషన్స్ పెట్టినా ట్విట్టరే దిక్కు అనేలా వ్యవహిస్తున్నారు. యూజర్లకు మరో మార్గం లేదనేలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ట్విట్టర్కు పోటీగా కూ యాప్ వచ్చినా అది పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. అయితే తాజాగా జుకర్ బర్గ్ పక్షికి ఉరితాడు బిగించేందుకు రంగంలోకి దిగారు. థ్రెడ్స్ అంటే దారం సింబల్తో ఓ సోషల్ మిడియా యాప్ను మార్కెట్లోకి వదిలాడు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు తెగ నచ్చేసిందట. మరి ఫ్యూచర్లో ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ వార్ మార్కెట్లో ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.