Amaravati : ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇక్కడ 47,017 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అయితే నిధులను మాత్రం కోర్టు కేసు తేలాకే ఇస్తామని షరతు విధించింది.
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో బలహీనవర్గాలకు గతంలో కేటాయించిన 46,928 ఇళ్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వాటి స్థానంలో అమరావతి ప్రాంతంలో పీఏంఏవై-అర్బన్ కింద 47,017 ఇళ్లు మంజూరు చేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. గత నెల 26న జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 67వ సమావేశంలో ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం గడువు ముగిసేలోపు కోర్టు కేసులు పరిష్కారమైతేనే నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది.
బయటి ప్రాంతాలకు చెందినవారికి అమరావతిలో స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. మాస్టర్ప్లాన్లో మార్పులు చేసింది. కొత్తగా ఆర్5 జోన్ను సృష్టించింది. విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల, మంగళగిరి ప్రాంతాలకు చెందిన 47,017 మందికి ఇళ్ల పట్టాలిచ్చింది. దీనిపై కొందరు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఆ స్థలాలపై పట్టాదారులకు హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.