Bandi Sanjay: కిషన్రెడ్డి ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టారు. తాను అలగలేదని వివరణ ఇచ్చుకున్నారు. పార్టీయే తనకు సర్వస్వం అని చెప్పుకొచ్చారు. కాసేపట్లో తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తానని.. మోదీ వరంగల్ సభ ఏర్పాట్లు చూస్తానని చెప్పారు. తనతో పాటు బండి సంజయ్ కూడా విమానంలో హైదరాబాద్ వస్తున్నారని అన్నారు.
కాసేపటికి.. కిషన్రెడ్డి వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. కార్యకర్తల జయజయ ధ్వానాలతో పార్టీ కొత్త అధ్యక్షుడికి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఈటల రాజేందర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. కిషన్రెడ్డితో పాటు ఈటలను భుజాల మీదకు ఎత్తుకొని.. సాదర స్వాగతం పలికారు కార్యకర్తలు.
కట్ చేస్తే.. కిషన్రెడ్డి వచ్చిన విమానంలో ఆయనతో పాటు బండి సంజయ్ రాలేదు. తనతో పాటు ఈటల కూడా వస్తారని చెప్పినా.. ఆయన రాకుండా ముఖం చాటేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలిచినా వెంట వెళ్లలేదు. తనకు పని ఉందంటూ ఢిల్లీలోనే ఆగిపోయారు. రైల్వేమంత్రిని కలిసి పలు విన్నపాలు చేశారు. బండి డుమ్మా కొట్టడంతో.. కిషన్రెడ్డి ఒక్కరే హైదరాబాద్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
ఈ పరిణామం ముందే ఊహించి.. బండి సంజయ్ ఆయనతో కలిసి రాలేదని అంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీ అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన బండి.. ఇప్పుడు తన కళ్లముందే మరొకరికి పార్టీ ప్రెసిడెంట్గా స్వాగతం లభిస్తుంటే.. చూసి తట్టుకునే శక్తి సంజయ్కు లేదంటున్నారు. అందులోనూ, ఈటల రాజేందర్ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి.. ఆ అవమాన భారాన్ని మోయలేకే.. బండి ఢిల్లీలోనే ఆగిపోయారని చెబుతున్నారు. తీరిగ్గా మర్నాడు రావొచ్చులే అనుకున్నారట బండి సంజయ్.