Elections: దేశంలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగబోతోందా..? నేతల వరుస కామెంట్లు ఇందుకు బలం చేకూరుస్తున్నాయా? ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతుండడంతో ఏదో జరుగుతోందన్న టాక్ అయితే మొదలైంది. ఏపీ సీఎం జగన్.. ప్రధాని, హోంమంత్రితో వరుస భేటీలతో ఈ అనుమానాలు ఇంకింత బలపడుతున్నాయి. ఎందుకంటే ఆర్నెళ్లలో ఏపీ సీఎం జగన్.. మూడుసార్లు ప్రధానితో భేటీ అయ్యారు. దీంతో ముందస్తు కోసమేనా ఈ మీటింగ్ అన్న డౌట్లు ఉన్నాయి. జనసేనాని సైతం ముందస్తుపై కామెంట్లు చేశారు.
మోదీ, అమిత్ షాలతో ఏపీ సీఎం జగన్ తాజాగా సమావేశమయ్యారు. పైకి పెండింగ్ నిధులు, విభజన హామీలు అని చెప్పినా… లోపల ఇష్యూ మాత్రం వేరు అని అంటున్నారు. ఆర్నెళ్లలో మూడుసార్లు పీఎంతో జగన్ భేటీ కీలక చర్చకు దారి తీస్తోంది. లేటెస్ట్ గా జరుగుతున్న భేటీ మాత్రం.. కేంద్ర పెద్దలే జగన్ను పిలిపించుకున్నారన్న టాక్ ఉంది. జగన్ అపాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్లింది కాదంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతోనే సీఎం జగన్తో ప్రధాని మోదీ, అమిత్షా చర్చించేందుకు పిలిపించుకున్నారన్న టాక్ ఉంది. షెడ్యూల్ ప్రకారమైతే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఏపీకి, అలాగే లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతోనే చర్చలు జరిగినట్లు చెబుతున్నారు.
ముందస్తుకు రెడీగా ఉండాలని ఇటీవలే నేతలకు అలర్ట్ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. లోక్సభకు ముందస్తుగానే ఎన్నికలు జరుగుతాయని, ఈ ఏడాదే జరిగినా ఆశ్చర్యం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత నెలలోనే చెప్పుకొచ్చారు. బిహార్ లో అభివృద్ధి పనులను వేగంగా జరపాలని అధికారులకు ఆదేశించారు. బీజేపీ నేతలు మాత్రం ముందస్తుపై పైకి కొట్టి పారేస్తున్నా లోలోపల ఏదో జరుగుతోందన్న వాదనైతే ఉంది. అంతే కాదు… ఏపీలో పవన్ కల్యాణ్ ఇప్పటికే మూడునాలుగు సార్లు ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ మాట్లాడారు. ఇది ఎక్కడైనా లీక్ అయిందా… పవన్ కు సమాచారం ఉందా… అందుకే ఎలక్షన్లకు ఏడాది టైమ్ ఉన్నా.. వారాహి యాత్ర చేపట్టారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది.
నిజానికి ఈ నాలుగేళ్లలో జగన్ పాలన అంతా అవినీతి, కుంభకోణాల మయం అంటూ ఇటీవలే అమిత్ షా, జేపీ నడ్డా ఆరోపించారు. జగన్ సర్కార్ పై బీజేపీ అగ్ర నేతలు డైరెక్ట్ అటాక్ చేయడం అదే తొలిసారి. మహాజన్ సంపర్క్ అభియాన్ సభకు విశాఖ, శ్రీకాళహస్తిలో నిర్వహించిన సమయంలో ఈ కామెంట్స్ చేశారు. అయితే ఆ వెంటనే సీఎం జగన్ ను ఢిల్లీ పిలిపించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఇటీవలే చంద్రబాబు కూడా అమిత్ షా, నడ్డాతో సమావేశమయ్యారు. 2019 తర్వాత చంద్రబాబును దగ్గర తీసుకోని అమిత్ షా ఇటీవలే అపాయింట్ మెంట్ ఇవ్వడం.. చర్చలు జరపడం జరిగిపోయాయి. ఏం మాట్లాడారన్న విషయం బయటకు చెప్పకపోయినా పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దని బాబు టీడీపీ నేతలు సూచించారు.
కేంద్ర కేబినెట్ భేటీలోనూ కామన్ సివిల్ కోడ్ సహా ఇతర కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఉభయసభల్లో కామన్ సివిల్ కోడ్ ను ఆమోదింపజేసి.. లోక్ సభను రద్దు చేసే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే వీటితో పాటే మరిన్ని రాష్ట్రాలు, అలాగే లోక్ సభకూ ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.
ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ అసెంబ్లీతో పాటే లోక్ సభ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు రాజకీయంగా లాభమా? నష్టమా? అన్న పాయింట్ కూడా తెరపైకి వస్తోంది. నిజానికి 2018 అసెంబ్లీ పోల్స్ తో చాలా మంది నేతలు అసెంబ్లీకి, ఆ తర్వాత 2019లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ ఓడిన వారు, లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి ఉంది. ఈసారి ఒకేసారి జరిగితే కీలక నేతల పరిస్థితి ఏంటని అంటున్నారు.