NCP: పవార్ వర్సెస్ పవార్గా మారింది మహారాష్ట్ర రాజకీయం. శరద్ పవార్, అజిత్ పవార్ వ్యవహారం మరింత ముదిరింది. ఇరువర్గాలు పోటాపోటీగా సమావేశాలకు పిలుపునిచ్చాయి. ఇరు పక్షాలు సమావేశాలకు హాజరుకావాలని విప్ జారీ చేశాయి.
ఎన్సీపీ చీలికవర్గ నేత అజిత్ పవార్ వర్గం నిర్వహించిన భేటీకి.. 29 మంది ఎమ్మెల్యేలతో పాటు ఐదుగురు ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. అటు.. శరద్ పవార్ వర్గం మీటింగ్కు 14 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు హాజరై.. మద్దతుగా నిలిచారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెండువర్గాల సమావేశాలకూ వెళ్లకుండా న్యూట్రల్గా ఉన్నారు.
మహరాష్ట్రలో ప్రస్తుతం ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అజిత్ పవార్ తనకు మొత్తం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. తాజాగా జరిగిన మీటింగ్కు మాత్రం 29 మంది ఎమ్మెల్యేలే వచ్చారు. ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనల నుంచి తప్పించుకోవాలంటే అజిత్ పవార్కి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.
బలప్రదర్శన కోసం నిర్వహించిన సభలో.. అజిత్ పవార్ మైండ్ గేమ్ ఆడారు. శరద్ పవార్ మా నేత, గురువు.. ఆయనే మా దేవుడు.. ఆయన ఆశీర్వాదాలు తమకు ఉన్నాయని ఆశిస్తున్నాం.. అంటూ బాబాయ్ని తెగ పొగిడేశారు. 83 ఏళ్ల శరద్ పవార్ ఇంకా రిటైర్ అవరా? అంటూ కామెంట్ చేశారు. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని ఓపెన్గానే చెప్పేశారు అజిత్ పవార్.
మరోవైపు బీజేపీతో పొత్తు కోసం శరద్ పవార్ ప్రయత్నించారని మరోబాంబు పేల్చారు అజిత్ పవార్. 2019లో శివసేనతో పొత్తు కన్నా ముందు బీజేపీతో కలిసేందుకు.. ఎన్సీపీ ఐదు సార్లు సమావేశాలు జరిపిందని ఆయన అన్నారు. గతేడాది శివసేనలో ఏక్నాథ్ శిండే తిరుగుబాటు చేసినప్పుడు కూడా బీజేపీతో చేతులు కలపడానికి ఎస్సీపీ చర్చించిందని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
ఎన్సీపీలో వర్గ పోరు.. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు చేరింది. పార్టీ పేరు, గుర్తు కోసం అజిత్ పవార్ వర్గం ఈసీని ఆశ్రయించింది. ఇప్పటికే వారికి మద్దతుగా ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల అఫిడవిట్లను ఈసీకి సమర్పించింది. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును తమ వర్గానికి కేటాయించాలని అజిత్ వర్గం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది.
శరద్ పవార్ సైతం పార్టీ పేరు, గుర్తును సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ పేరు, గుర్తుపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ తన మాట కూడా వినాలని కోరుతూ.. కేవియట్ దాఖలు చేసింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని శరద్ పవార్ వర్గం.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది.