Kishan Reddy today news(Latest political news telangana): తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. ప్రకటన వచ్చినప్పటి నుంచీ మీడియాకు ముఖం చాటేస్తూ వచ్చారు కిషన్రెడ్డి. ఆయనకు పార్టీ పదవి ఇష్టం లేదని.. కేంద్రమంత్రి పదవిని వదులుకోనంటున్నారంటూ ప్రచారం జరిగింది. కేంద్ర కేబినెట్ భేటీకి వెళ్లకుండా.. అధిష్టానంపై కిషన్రెడ్డి అలిగారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేళకు మీడియా ముందుకు వచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చారు.
తనకు ఎలాంటి అలక లేదని అన్నారు కిషన్రెడ్డి. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వరకు మంత్రిగా కొనసాగుతానని చెప్పారు. ఆ తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి.. పార్టీ పగ్గాలు స్వీకరిస్తానని చెప్పారు.
తనకు నాలుగోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారని చెప్పుకొచ్చారు కిషన్రెడ్డి. తానిప్పటి వరకు పార్టీని ఏదీ అడగలేదని.. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తూ వస్తున్నానని చెప్పారు. 1980 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటున్నానని అన్నారు. తనకు పార్టీని మించింది ఏదీ లేదని.. పార్టీయే తన శ్వాస అని తెలిపారు.
జాతీయ, రాష్ట్ర నాయకత్వాలను సమన్వయం చేసుకుంటూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తామని చెప్పారు కిషన్రెడ్డి. శుక్రవారం వరంగల్లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.