Tirumala : తిరుమలలో పార్వేట మండపం కూల్చివేతపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. రాయల కాలంలో నిర్మించిన మండపాన్ని కూల్చడంపై వివాదం రాజుకుంది. చారిత్రాత్మక కట్టడం కూల్చివేత సరికాదంటోంది సీపీఎం అనుబంధ కార్మిక సంఘం సీఐటీయూ. ఖాళీ ప్రదేశంలో నిర్మాణం చేస్తే బాగుండేదని కార్మిక నేతలు. పార్వేటి మండపానికి 350 సంవత్సరాల చరిత్ర ఉందని.. భక్తుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదంటున్నారు.
దాదాపు 350 సంవత్సరాల క్రితం రాయల కాలంలో నిర్మితమైన ఈ రాతి మండపం కింది భాగం అలాగే ఉంచి, పై భాగంలో స్వామివారిని కొలువు తీర్చి.. ఉత్సవ సేవలు నిర్వహించే పురాతన రాతిమండపాన్ని పూర్తిగా తొలగించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. గత రెండు రోజులుగా ఈ మండపాన్ని కూలదోసే పనులు చేపట్టారు. ఈ స్థానంలో మరింత ఆకర్షణీయంగా స్వామివారి ఉత్సవ సేవలకు అనుగుణంగా నూతన మండప నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ పార్వేట మండపం చుట్టూ పరిసర ప్రాంతాలను ఉత్సవ సమయంలో భక్తులకు అనుగుణంగా సౌకర్యవంతంగా అభివృద్ధి చేసిన టీటీడీ రాతిమండపాన్ని మాత్రం యధాతధంగా ఇంతకాలం అలాగే ఉంచేసింది. అయితే ప్రస్తుతం ఈ మండపం కింది భాగంలోని మండపాన్ని అలాగే ఉంచి పై భాగంలోని మండపాన్ని మాత్రం తొలగించే చర్యలు చేపట్టింది. ఈ రాతి మండపం పై భాగంలో టీటీడీ నిర్మించిన దేవత మూర్తుల ప్రతిమలను సైతం పగలగొట్టి కింద పడేశారు.
ప్రస్తుతం ఈ పార్వేట మండపం పై భాగాన్ని రాతి మండపాన్ని కూల్చివేయడం ఓ రకంగా చారిత్రాత్మక కట్టడాన్ని కనుమరుగు చేయడమేనని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే తిరుమలలోని అనేక చారిత్రాత్మకమైన ఆధారాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం, వేయికాళ్ల మండపం తొలగించడం వివాదాస్పదమైన సంఘటనలు చోటు చేసుకున్నాయ్. ప్రస్తుతం పారువేట మండపం పునర్నిర్మాణ పనులు ఏ పరిస్థితులకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.