Twitter : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న పోటీని తట్టుకోవాలంటే.. క్రియేటివ్ టీమ్ కొత్త కొత్త ఐడియాతో ముందుకు రావాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలోనే వారు ప్రవేశపెట్టే అన్ని ఐడియాలు, కొత్త కొత్త ఫీచర్లు.. అన్ని యూజర్లను ఆకర్షిస్తాయని గ్యారెంటీ లేదు. ఇక గత కొంతకాలంగా ట్విటర్ యాజామన్యం అందుబాటులోకి తీసుకొస్తున్న ఫీచర్స్, అప్డేట్స్.. యూజర్లను నిరాశకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో ట్విటర్ అప్డేట్ కూడా యూజర్ల నుండి నెగిటివిటీని అందుకుంటోంది.
తాజాగా ట్విటర్.. తన యూజర్లపై ఆంక్షలు విధించింది. రోజుకు కొన్ని ట్వీట్స్ మాత్రమే చదవాలి అని లిమిట్ పెట్టింది. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత ట్విటర్ సైట్ను ఓపెన్ చేయడం వీలు కాదని ప్రకటించింది. దీంతో చాలామంది యూజర్లు ట్విటర్పై ఆగ్రహంతో ఉన్నారు. రోజుకు ఎన్ని ట్వీట్స్ చదువుతున్నాం, ఎంతసేపు ట్విటర్కు కేటాయిస్తున్నాం అని కౌంట్ చేసుకుంటామా అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఫీచర్కు నెగిటివిటీ వస్తున్నా.. యాజమాన్యం మాత్రం దీనిని వెనుక తీసుకునే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది.
ట్విటర్ తెలిపినదాని ప్రకారం.. పెయిడ్ సబ్స్క్రైబర్లు.. రోజుకు 6000 ట్వీట్లు చూడవచ్చు. ఇక అన్వెరిఫైడ్ యూజర్లు మాత్రం రోజుకు కేవలం 600 పోస్టులు మాత్రమే చూడవచ్చు. దీంతో యూజర్లు ఇకపై ట్విటర్ ఎలా ఉపయోగించాలి అని వాపోతున్నారు. కేవలం యూజర్లు మాత్రమే కాదు.. ట్విటర్ ప్రవేశపెడుతున్న ఈ పోస్ట్ లిమిట్తో ఉద్యోగులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్విటర్ కంపెనీలో ఉద్యోగులపై వర్క్ విషయంలో అదనపు బారం విధిస్తుండగా.. వారి సమ్మతం లేకుండా ఇలాంటి ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్టు నిపుణులు అనుకుంటున్నారు. ఎలన్ మస్క్ కానీ, కొత్త సీఈఓ లిండా యాక్కరినో కానీ.. ట్విటర్లో జరిగే మార్పుల గురించి ఉద్యోగులకు ముందస్తు సమచారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని సమాచారం.
కేవలం ఉద్యోగులకు మాత్రమే కాదు ట్విటర్ సేల్స్, అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ముందస్తుగా ఎలాంటి సమాచారం అందడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వారితో ముందుగా చర్చించి ఉంటే.. పోస్టులపై లిమిట్ పెడితే.. అవి యాడ్స్పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలిసేదని అంటున్నారు. ట్విటర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ రెయ్డీ మాత్రం యాప్పై స్పామ్ ప్రభావం తగ్గించడానికి ఈ లిమిట్ పెట్టామని, త్వరలోనే తొలగిస్తామని చెప్తున్నారు. కానీ ఎంతైనా ఎలన్ మస్క్ ట్విటర్కు సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి టెక్నికల్ స్టెబిలిటీ పూర్తిగా తగ్గిపోయిందంటూ నిపుణులు బయటపెట్టారు.