Tirumala Updates : కాలానికి తగ్గట్టు అప్ గ్రేడ్ అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పటికే ఆన్ లైన్ లో సేవా టిక్కెట్లు, దర్శనం, వసతి గదులు బుకింగ్ ను ఆన్ లైన్ చేసింది. భక్తులకి ఇబ్బంది లేకుండా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీని నియంత్రిస్తూ సులభంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఆన్ లైన్ విధానాన్ని కూడా అమలు చేస్తోంది. తాజాగా ఇక నుంచి తిరుమలతోపాటు స్థానిక ఆలయాలతోపాటు టీటీడీకి చెందిన ఉపాలయాల్లోను కూడా ఫోన్ పే, యూపీఐ ద్వారా చెల్లింపులకు కసరత్తు చేస్తోంది. ప్రసాదాలు, సేవా టిక్కెట్లు, క్యాలెండర్లు, డైరీలు, కొనుగోలు చేసే భక్తులు డెబిట్ కార్డులు, క్యూ ఆర్ కోడ్ స్కానర్ ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటోంది.
తిరుమలలో ఇక నుంచి అన్ని చెల్లింపులు యూపీఐ విధానంలోనే జరిగే విధంగా అడుగులు వేస్తోంది. భక్తులకు వసతి గదుల కేటాయింపు కౌంటర్లలో ఇప్పటికే యూపీఐ చెల్లింపులకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కొండపై అన్ని రకాల సేవల చెల్లింపు విధానాలకు యూపీఐని అనుమతించాలని నిర్ణయానికి వచ్చింది. యూపీఐ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే అక్రమాలకు, అవకతవకలకు అవకాశం ఉండదని దేవస్థానం భావిస్తోంది. జేఈవో వీరబ్రహ్మం ఆలయాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఎక్కువ రద్దీ ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్ లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయనుంది. స్థానిక ఆలయాలలో కళ్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జిత సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పనిలో పనిగా తిరుమలలో భద్రతపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. డ్రోన్ ఘటనలు దృష్టిలో పెట్టుకుని నిఘా పెంచింది. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ దళాన్ని సిద్దం చేసుకుంటోంది. తిరుమలపై ఉగ్రవాదుల కన్ను ఉందని గతంలోనే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముందు జాగ్రత్తగా టీటీడీ అత్యాధునిక భద్రత వ్యవస్థను కొండపై ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే ఆక్టోపస్ టీంని ఏర్పాటు చేస్తోంది.