Tata Motors : ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమేటిక్ కార్లు.. ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ ఎన్ని మార్కెట్లోకి వచ్చినా కొన్ని ఆటోమొబైల్ సంస్థలకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ మారదు. ఆ సంస్థ ఎలాంటి మోడల్ కార్లను విడుదల చేసినా కూడా బ్రాండ్ మీద నమ్మకంతో కొనే కస్టమర్లు చాలామంది ఉంటారు. అలాంటి కస్టమర్లను సంపాదించుకున్న సంస్థ టాటా మోటర్స్. ప్రస్తుతం టాటా మోటర్స్.. తమ ప్యాసెంజర్ వాహనాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది.
ప్రతీ ప్యాసెంజర్ వాహనాల ధరను పెంచేస్తున్నట్టుగా టాటా మోటర్స్ తాజాగా ప్రకటించింది. ఏ మోడల్ అయినా, ఏ వేరియంట్ ధర మాత్రం పెరుగుతుంది అని తెలిపింది. జులై 17 నుండి మారిన ధరలు అందుబాటులోకి వస్తాయని బయటపెట్టింది. ప్రతీ ప్యాసెంజర్ వాహనం మీద 0.6 శాతం ధర పెరగనుందని ప్రకటించింది. అన్ని ప్యాసెంజర్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)ల ధరలు కూడా పెరుగుతాయని తెలుస్తోంది. పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్లను అందుకోవడం కోసం టాటా మోటర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
2023 జులై 16 లోపు ప్యాసెంజర్ వాహనాలను బుకింగ్ చేసుకున్న వారికి 2023 జులై 31 లోపు డెలివరీలు అందుకునే వారికి ముందు ధరలే అందుబాటులో ఉంటాయని టాటా మోటర్స్ తెలిపింది. పంచ్, నెక్సన్, హ్యారియర్ లాంటి కార్లతో టాటా మోటర్స్ తన క్రేజ్ను మరింత పెంచుకుంది. గతేడాది పోలిస్తే.. ప్యాసెంజర్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయని టాటా మోటర్స్ ప్రకటించింది.
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎస్యూవీ లాంటి మోడల్స్ లాంచ్ అవ్వడంతో టాటా మోటర్స్ సేల్స్పై కొంత ఎఫెక్ట్ పడిందని మ్యానేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలను పెంచడం గురించి యాజమాన్యం పెద్దగా మాట్లాడలేదు. కానీ టాటా మోటర్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర ఆటోమొబైల్ సంస్థలపై కూడా ప్రభావం చూపిస్తుందని, త్వరలోనే మెల్లగా అన్ని సంస్థలు తమ ధరలను పెంచే పనిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.