Purandeswari: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి పురందేశ్వరి.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న సోము వీర్రాజును తప్పించిన బీజేపీ హైకమాండ్.. ఆ స్థానంలో పురందేశ్వరికి అవకాశం కల్పించారు. రేసులో ఉన్న సత్యకుమార్, సుజనాచౌదరిని కాదని.. అధిష్టానం పురందేశ్వరి వైపే మొగ్గు చూపించింది.
ఇన్నాళ్లూ రెండు జాతీయ పార్టీల్లో కీలక పదవులు చేపట్టిన పురందేశ్వరి.. పలుమార్లు కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో బాపట్ల నుంచి పోటీ చేసిన పురందేశ్వరి.. లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2006లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. అలాగే 2009లో విశాఖ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా అదే శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2012లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే, 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పురందేశ్వరి.. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. టీడీపీతో పొత్తులో భాగంగా రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిన పురందేశ్వరి.. 2019లో కూడా విశాఖ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ఇప్పుడు ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయ్యారు.
పురందేశ్వరి రాకతో.. ఏపీలో బీజేపీ పొత్తు రాజకీయాలు మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తులో ఉండగా.. ఈ అలయెన్స్ లోకి టీడీపీ జాయిన్ అయ్యే అవకాశాలు బలపడనున్నట్లు తెలుస్తోంది.