Sri Dattatreya Swamy : త్రిమూర్తి అంశాల రూపమే శ్రీ దత్తాత్రేయ స్వామి. తన నామ స్మరణ చేస్తే చేస్తే చాలు భక్తుల్ని స్వామి కంటికి రెప్పలా చూసుకుంటారని విశ్వాసం. గురు చరిత్ర ప్రకారం జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ప్రాంతం కర్ణాటకలోని గాణగాపూర్. ఇక్కడ స్వామి పాదుకలను దర్శించుకుంటే చాలు దయ్యాలు, ప్రేతపిశాచాల బాధలు నశించి మనశ్శాంతి కలుగుతుందని నమ్మకం. దశావతారాల పరంపర తర్వాత భక్తుల్ని రక్షించేందుకు శ్రీ విష్ణువు దత్తాత్రేయుడిగా అవతారం ఎత్తారని పురాణాలు చెబుతున్నాయి. దత్తాత్రేయుని పాదకలతోపాటు సంగమ బీమా దర్శనం లభించే ప్రాంతమే గాణగాపూర్.
గాణగాపూర్ యాత్రలో మూడు అంశాలు ముఖ్యమైనవి నది సంగమ ప్రదేశ సందర్శనం, రెండోది శ్రీదత్త పాదుకల దర్శనం, మూడోది శ్రీకాళేశ్వర ఆలయ దర్శనం. బీమా నది సంగమం దగ్గర ఐదంతస్తుల రాజగోపురం, పంచ కలశాలతో ఆలయం కనిపిస్తుంది. ఉడిపిలో శ్రీకృష్ణుని దర్శనం ఒక గవాక్షం ద్వారా జరుగుతుంది. అదేమాదిరిగా ఇక్కడ కూడా శ్రీ గురు దత్త పాదుకల దర్శనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల విశ్వాసంతో శ్రీ దత్తపాదుకులను దర్శించుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని చెప్పాడు దత్తాత్రేయుడు. ప్రకృతి ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నారు.స్వామి వారి ఆలయంలో వైష్ణవ సంప్రదాయలను అనుసరించి పూజా క్రతువులు నిర్వహిస్తుంటారు .అదే సమయంలో శైవ సిద్దాంతాలను కూడా సమపాళ్లలో పాటించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అందుకు నిదర్శనమే కాషాయ గణపతి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు.
దత్తాత్రేయ క్షేత్రంలో అరుపులు , కేకలు గందరగోళం మధ్య భక్తులు స్వామిని దర్శించుకోవడం సాధారణమైన విషయం. మానసిక సమస్యలతో బాధపడేవారు ఇక్కడ ఎక్కువగా వస్తుంటారు. స్వామిని మాములుగా దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఉన్నట్టుండి పూనకం వచ్చినట్టుగా ఊగిపోతుంటారు. అరుపుల, కేకులతో భయపెట్టే విధంగా ప్రవర్తిస్తుంటారు. స్వామిని నమ్మేవారికి దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుందని చెబుతుంటారు. ఆ సమస్యలు ఉన్నవారు ఇక్కడకి రాగానే వింతగా ప్రవర్తించడానికి కారణం కూడా అదేనని అంటుంటారు.