New Pension Scheme: ఓట్ల కోసం ఎన్ని పాట్లైనా పడతాయి పార్టీలు. ఓటరు దేవుళ్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని నిత్యం పరితపిస్తుంటాయి. అందుకోసం, రకరకాల స్కీములతో బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. తాజాగా, మరో వెరైటీ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది సర్కారు. సీఎం ప్రకటించిన ఆ కొత్త పెన్షన్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారెవా.. ఇలాంటి పెన్షన్లు కూడా ఇస్తారా? అంటూ పండుగ చేసుకుంటున్నారు పెళ్లికాని ప్రసాదులు.
అవును, పెళ్లికాని వారికి ఇకపై నెల నెలా పెన్షన్ ఉవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, బ్యాచిలర్స్ అందరికీ పింఛన్ ఇవ్వరట. కొందరికేనట. టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్లై అంటున్నారు సీఎం.
45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పెళ్లి కాని వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చేలా కొత్త పథకం ప్రవేశపెట్టబోతోంది హర్యాణా ప్రభుత్వం. మరో నెలలోనే ఈ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని స్వయంగా ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. అబ్బాయిలకే కాదు.. 45 ఏళ్లు నిండిన పెళ్లి కాని మహిళలకూ ఈ స్కీమ్ అప్లై అవుతుందని చెప్పారు. అయితే, ఆ పెన్షన్ ఎంత ఇస్తారనే వివరాలు మాత్రం లీక్ చేయలేదు.
మరి, 60 ఏళ్లు నిండిన వారి పరిస్థితి ఏంటి? అనే అనుమానం రావొచ్చు. వారికి వృద్ధాప్య పింఛను ఉందిగా అంటున్నారు. ఆ మొత్తాన్ని కూడా త్వరలోనే 3వేలకు పెంచనున్నట్టు సీఎం ఖట్టర్ చెప్పారు.
వృద్ధాప్య పెన్షన్, వితంతు పింఛన్, వికలాంగులు, రైతుల పెన్షన్.. ఇలాంటివి అనేక రకాల పథకాలు చూశాం కానీ.. ఇప్పుడు కొత్తగా ఈ పెళ్లికాని వారికి పెన్షన్ ఇవ్వడం ఏంటంటూ.. సోషల్ మీడియాలో విమర్శలూ, జోకులూ పేలుతున్నాయి.