Anjaneya Swami : శివాలయాల్లో శివుడి ఎదురుగా నంది విగ్రహం ఉన్నట్టే ఆంజనేయ స్వామి ఎదురుగా ఒంటెను వాహనంగా ఆలయాల్లో ఉంచుతారు. కొన్ని దేవాలయాల్లో మాత్రం ఇలా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం శివ, విష్ణువు మధ్య ఒకసారి వాదులాట జరిగి ఒక పందెం వేసుకున్నారట. శివుడు విష్ణుమూర్తికి సేవ చేయాల్సి వచ్చింది. అలా శివుడు.. విష్ణు సేవ కోసం హనుమంతుడిగా అవతారం ఎత్తాడు. ఆ సందర్భంలో తనను విడిచి వెళ్తున్న శివుడ్ని పార్వతి ఒక ప్రశ్న వేస్తుంది. అర్థనారీశ్వరి అయిన తాను.. ఇతర అవతారాలను ఎత్తేటప్పుడు కూడా మీ వెంట ఉండాలనుకుంటున్నా అని కోరిందట. శివుడు అనుగ్రహిస్తాడు.
హనుమంతుడి బలమంతా తోకలోనే ఉంటుంది. ఆ తోక పార్వతి స్వరూపం. అందుకే స్వామికి పూజ చేసేటప్పుడు తోకకి పువ్వులు పెడుతుంటారు. బొట్టు పెట్టడం కూడా పార్వతి మాతకి పెట్టినట్టుగా భావిస్తారు. పార్వతి, పరమేశ్వరుల సంభాషణ విని నందీశ్వరుడు తనను కూడా ఇతర అవతారాల్లో వాహనంగా మలుచుకోమని కోరగా..శివుడు వరమిస్తాడు. ఆంజనేయుడి వాహనం ఒంటె అని పరాశర సంహితలో పేర్కొన్నారు. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఆంజనేయుడు తొలిసారిగా శ్రీరాముడ్ని పంపానదీ తీరంలోనే కలిశాడు. అందుకే ఈ ప్రాంతమంటే హనుమకు ఎంతో ఇష్టం. ఈ నదీ తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని ప్రతీతి.
ఆంజనేయస్వామి పంపా తీర ప్రదేశంలోను , రామ సేతు వారధి దగ్గర రోజూ ప్రదక్షిణలు చేస్తుంటారట. ఈ రెండూ ఇసుక తీరంలో ఉండే ప్రాంతాలు. ఇలాంటి చోట్ల అనుకూలమైన వాహనం ఒంటె. అందుకే నందీశ్వరుడు ఒంటెగా మారారు. ప్రతీ దేవుడికి వాహనం ఏదైతే ఉంటుందో ధ్వజం కూడా అదే అవుతుంది. కింద వాహనంలాగా పైన ధ్వజంగాను కనిపిస్తుంది. మహా విష్ణువుకు గరుడ వాహనం, గరుడ ధ్వజం ఉంటుంది. ఆ రకంగా ఒంటె హనుమంతుడి వాహనం అయింది.