TamiliSai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించారు. సచివాలయంలో ఉస్మానియా ఆస్పత్రిపై ఓవైపు మంత్రి హరీశ్రావు సమీక్ష కొనసాగుతుండగానే.. గవర్నర్ ఆస్పత్రిని పరిశీలించడం చర్చనీయాంశమైంది.
ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలను, పాత భవనాన్ని పరిశీలించారు గవర్నర్. వార్డుల్లో తిరుగుతూ.. పేషెంట్స్తో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా హాస్పిటల్కు రాలేదన్నారు గవర్నర్ తమిళిసై. ఆసుపత్రి భవనం కట్టి వందల ఏళ్లు అవుతోందని.. కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉస్మానియాకు రోజుకు 2వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారని.. రోజూ సుమారు 200 వరకు సర్జరీలు చేస్తున్నారని చెప్పారు. అంతమంది వస్తున్న ఉస్మానియాకు సరైన భవనం లేదని.. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయంటూ.. దుస్థితి వెళ్లగక్కారు.
మరోవైపు, గవర్నర్ తమిళిసై ఉస్మానియాను సందర్శించడంపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గవర్నర్ రాజకీయం చేయడం తగదన్నారు. కొత్త భవనాన్ని కట్టేందుకు సర్కారు సిద్ధంగా ఉందని.. అయితే, ఆ విషయం కోర్టులో ఉందని అన్నారు.