Opposition Meeting : విపక్షాల బెంగళూరు సమావేశం వాయిదా పడింది. ఈ నెల 13, 14 తేదీల్లో భేటీ కావాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీని వాయిదా వేశాయి విపక్ష పార్టీలు. పార్లమెంట్ సమావేశాలతో పాటు బిహార్, కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ భేటీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
గత నెల 23న పాట్నాలో తొలిసారిగా భేటీ అయ్యాయి విపక్ష పార్టీలు. గత సమావేశాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక నేపథ్యంలో ఈసారి భేటీకి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ తెలిపింది.
బిహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 10 నుంచి 24 వరకు జరగనున్నాయి. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత మళ్లీ ఈ భేటీ జరగనుంది.