Spy Fame Iswarya Menon : ఈమధ్య కాలంలో హీరోయిన్స్కు బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు ఇచ్చే విషయంలో మేకర్స్ పెద్దగా ఆలోచించడం లేదు. ఒక కొత్త హీరోయిన్ టాలీవుడ్లో డెబ్యూ చేస్తుంది అంటే తన మొదటి సినిమా విడుదల అవ్వకముందే మరికొన్ని తెలుగు సినిమాల ఛాన్సులు తనను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా మరో తమిళమ్మాయికి కూడా ఇదే విధంగా టాలీవుడ్లో అదృష్టం వహించినట్టుగా అనిపిస్తోంది. తనెవరో కాదు.. ‘స్పై’ భామ ఐశ్వర్య మీనన్.
కొత్త తరహా కథలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు నిఖిల్. తాజాగా ఇండియా బిగ్గెస్ట్ సీక్రెట్ను బయటపెడతానంటూ ‘స్పై’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. తాజాగా విడుదలయిన ఈ చిత్రం ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ను అందుకుంటూ కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోతోంది. ఇక ఇందులో హీరోయిన్గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది తమిళమ్మాయి ఐశ్వర్య మీనన్.
నటిగా తెలుగు, తమిళంలో ఒకేసారి డెబ్యూ చేసింది ఐశ్వర్య మీనన్. ఆ తర్వాత మెల్లగా తనకు హీరోయిన్ ఛాన్సులు రావడం మొదలయ్యింది. హీరోయిన్గా దాదాపు అన్ని సౌత్ భాషల్లో ఐశ్వర్య డెబ్యూ అయ్యింది. కానీ ఎందులోనూ తనకు పూర్తిస్థాయి గుర్తింపు రాలేదు. తాజాగా నిఖిల్తో చేసిన స్పై మాత్రం ఐశ్వర్యకు గుర్తింపుతో పాటు అవకాశాలను కూడా తెచ్చిపెట్టిందని టాక్. ఒకే ఒక్క సినిమాతో ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో బిజీగా గడిపేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో ఒక సినిమా ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతంగా హైప్ను పెంచేస్తోంది. ఇక ఇందులో ఐశ్వర్య మీనన్ ఒక కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. ఓజీలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్గా కనిపించనున్నాడు.