Yatra 2 Movie : ఏ భాషలో అయినా బయోపిక్స్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. పైగా బయోపిక్స్గా తెరకెక్కిన సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్ అవుతాయని కూడా మేకర్స్ భావించడం మొదలుపెట్టారు. మనకు తెలిసిన ఫేమస్ వ్యక్తుల జీవితాల వెనుక ఉన్న కథ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా స్పెషల్గా ఆసక్తి చూపిస్తారు. తాజాగా అలాంటి ఒక క్రేజీ, కాంట్రవర్షియల్ బయోపిక్.. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా హిట్ అయ్యింది. రాజశేఖర్ రెడ్డి అభిమానులు అంతా దర్శకుడు మహి వీ రాఘవకు ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో టాలీవుడ్లో దర్శకుడు మహిని వెతుక్కుంటూ ఆఫర్లు వచ్చాయి. ఇక యాత్ర సినిమా సమయంలోనే కచ్చితంగా దీనికి సీక్వెల్ ఉంటుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆ సీక్వెల్పై ఓ క్లారిటీ వచ్చేసింది.
యాత్ర సినిమా రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కగా.. యాత్ర 2 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్ జగన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతుందని రూమర్స్ వచ్చాయి. దాదాపుగా అదే నిజమని అందరూ భావిస్తున్నారు కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్లో హీరోగా మలయాళ హీరో మమ్మూట్టీని ఎంపిక చేసుకున్నాడు మహి. ఇప్పుడు జగన్ పాత్రను పోషించడం కోసం తమిళ హీరో జీవాను ఎంపిక చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ దీనిపై ఒక క్లారిటీ లేదు.
తాజాగా యాత్ర 2 గురించి అప్డేట్ను అందించాడు మహి వి రాఘవ. ఫస్ట్ లుక్ను విడుదల చేస్తూ సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. 2024 ఫిబ్రవరీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఏపీ జెనరల్ ఎలక్షన్స్ సమయంలోనే ఈ సినిమా థియేటర్స్లోకి రానుందని అంచనా. యాత్ర 2 సినిమా పూర్తిగా జగన్ పాదయాత్రపై ఫోకస్ చేస్తుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తుండగా.. శివ మేక నిర్మాతగా వ్యవహరించనున్నాడు.