Firing Again in Manipur : మణిపూర్లో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తుండగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన బిష్ణుపూర్ జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి గ్రామానికి కాపలాగా ఉన్న విలేజ్ వాలంటీర్లపై ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
మరోవైపు జాతీయ రహదారులను నిర్బంధించి ఆందోళనలను కొనసాగిస్తున్న కుకీ వర్గీయులు వెనక్కి తగ్గారు. హైవేలపై తమ నిరసనలను విరమించాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 37పై యథావిధిగా రాకపోకలు జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుకీ వర్గాలు తెలిపాయి. మణిపూర్లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి కుకీలు ఈ రెండు హైవేలను నిర్బంధించి నిరసన తెలుపుతున్నారు.