BJP: మహారాష్ట్రలో తాము అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి.. తిరుగుబాటులతో విపక్షాల వెన్ను విరిచిన బీజేపీ.. తన నెక్ట్స్ టార్గెట్గా బీహార్ను సెలెక్ట్ చేసుకుందా? జనతాదళ్ యునైటెడ్.. రాష్ట్రీయ జనతాదళ్ను నిలువునా చీల్చేందుకు రెడీ అవుతుందా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను సాక్షాత్తూ బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ వెల్లడించారు. జనతాదళ్ యునైటెడ్తో పాటు పలువురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారని అరవింద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారితో వేర్వేరుగా సమావేశం అవుతున్నారు. తన శాసనసభ్యులతో వ్యక్తిగత సమావేశాలు నిర్వహించడం వెనుక నితీష్ కుమార్ తన పార్టీలో చీలికకు భయపడుతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
నితీష్ కుమార్ గతేడాది ఆగస్టులో బీజేపీతో పొత్తును విరమించుకుని మహాకూటమితో చేతులు కలిపారు. నితీష్ కుమార్ బీజేపీతో విడిపోయినప్పటి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత పది నెలల్లో ఐదుసార్లు బీహార్లో పర్యటించారు. ప్రతి సందర్భంలోనూ తన ప్రసంగాల్లో నితీష్ కుమార్ను ఘాటుగా విమర్శిస్తూ, బీజేపీ తలుపులు ఆయనకు శాశ్వతంగా మూసుకుపోయాయని ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటులో నితీష్ కీలకంగా వ్యహరిస్తున్నారు. అంతేకాదు వరుసగా ప్రాంతీయ పార్టీలతో భేటీలు నిర్వహించడమే గాకుండా.. విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ కూడా అయ్యారు. గత నెల 23న బీహార్ రాజధానిలో 15 విపక్ష పార్టీల భేటీ విజయం వెనుక ఆయన కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు.
సరిగ్గా విపక్షాలన్ని ఏకమయ్యే సమయంలో బీజేపీ ప్రాంతీయ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను ఉసిగొల్పుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తిరుగుబాటు చేసే వారికి మేమున్నామని ఆపన్నహస్తం చాస్తూ.. ఆ పార్టీలను చీలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు బీహార్లోని రెండు కీలక పార్టీలైన ఆర్జేడీ, జేడీయూ విషయంలో కూడా ఇదే జరుగుతుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.