BJP: కేంద్ర కేబినెట్ సమావేశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎవరికి తీపి కబురు అందనుంది.. ఎవరికి చేదు గులిక పడనుందనే గుబులు పట్టుకుంది. మోదీ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గం సమవేశం పార్లమెంట్ సెషన్స్కు ముందు జరగడం సర్వసాధారణమే. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండగా కేంద్ర కేబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ వివిధ రాష్ట్రాల ఎన్నికల సమయంలో కేబినెట్లో మార్పులు చేర్పులు జరిగాయి. ఈసారి కర్ణాటక ప్రభావం వల్ల మంత్రివర్గంతో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు ఆయన చేసిన వ్యాఖ్యలనే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ సెమీఫైనల్స్గా భావిస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలకు కేబినెట్లో పెద్దపీట వేస్తారనే చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు మోదీ తన కేబినెట్లో చోటు కల్పించారు. ఐదు రోజుల క్రితం ప్రధాని మోదీ అమిత్ షా, జేపీ నడ్డా తదితరులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ భేటీలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసమేనని బలమైన వాదనలు వినిపించాయి. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ బీఎల్ సంతోష్తోనూ ప్రధాని చర్చలు జరిపారు. ఈ చర్చలు జరపడం మంత్రివర్గంతోపాటు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పులపైనా దృష్టి పెట్టారని టాక్ నడిచింది. సాయంత్రం కేబినెట్ మీటింగ్ తర్వాత కీలకమైన ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇటీవలే న్యాయశాఖ మంత్రి మార్పు జరిగింది. కిరణ్ రిజుజును న్యాయశాఖ నుంచి తప్పించి అర్జున్ రామ్ మేఘ్వాల్కు ఆ బాధ్యతలు అప్పగించారు. కిరణ్ రిజుజుకు ఎర్త్ అడ్ సైన్స్ పోర్ట్ఫోలియోకే పరిమితం చేశారు. సుప్రీంకోర్టు కొలిజీయం వ్యాఖ్యల దుమారంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. మరోవైపు మణిపూర్లో మంటలు చల్లారడం లేదు. రెండు తెగల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. రిజర్వేషన్ల అంశంతో చెలరేగిన హింస అదుపులోకి రావడం లేదు. దీనిపై ఇటీవలే అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయి. కేబినెట్ భేటీలో మణిపూర్ అంశంపైనా కీలక నిర్ణయం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మారుస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. దక్షిణాదిలో తెలంగాణలో విజయం సాధించడం కమలం పార్టీకి సవాల్గా మారనుంది. ఇప్పటికే కర్ణాటక ఓటమితో సౌత్లో ఆ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది. తెలంగాణలో కమలం నేతలు గట్టిగా పోరాడుతున్నట్లుగా కనిపించినా.. కన్నడ ఫలితాలతో డీలా పడ్డారు. అంతర్గత విబేధాలతో పార్టీ సతమతం అవుతోంది. ఈ పంచాయతీ ఢిల్లీకి కూడా చేరింది. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరగ్గా.. ఇద్దర్నీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి బుజ్జగించింది. రాష్ట్ర నాయకత్వంపై నేతలు గుర్రుగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. బండి సంజయ్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే రేసులో లక్ష్మణ్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ వాదనలకు బలం చేకూర్చేలా బండి సంజయ్ కామెంట్స్ చేశారు. తాను ఈనెల 8న ప్రధాన పర్యటనలో బీజేపీ అధ్యక్షుడి హోదాలో హాజరవుతానో లేదో అని నిర్వేదం వ్యక్తం చేశారు.
బీజేపీ స్టేట్ చీఫ్ మార్పులేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పదేపదే చెబుతున్నా.. ఖాయంగానే కనిపిస్తోంది. ఇక్కడ తాము గెలవడం కంటే కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా చేయాలనేదే మోడీ, అమిత్ షా, నడ్డా, బీఎల్ సంతోష్ టార్గెట్ అని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. కీలక నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావును కమలం గూటికి చేర్చే ప్రయత్నాలు ఫలించలేదు. వాళ్లిద్దరూ కాంగ్రెస్లో చేరడం కమలం నేతలకు మింగుడు పడటం లేదనే వాదనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హస్తాన్ని నిలువరించాలంటే తెలంగాణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనేది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది. అందులో భాగంగానే మార్పులు చేర్పులు జరగనున్నాయనే ప్రచారం జరుగుతోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా తప్పిస్తారనే టాక్ నడుస్తోంది. ఆయన ప్లేస్లో సత్యకుమార్కు పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే యూనిఫార్మ్ సివిల్ కోడ్-UCC అంశంపై కేంద్ర కేబినెట్ దృష్టి పెట్టనుంది. UCCకి మద్దతిస్తామని ఆప్ ప్రకటించింది. తాము వ్యతిరేకించబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించినా .. మద్దతివ్వమని ట్విస్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో UCC అమలుపై కేబినెట్లో చర్చ అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.