PM Modi news today in telugu(Today’s breaking news in India): ఒకే దేశం.. ఒకే చట్టం నినాదంతో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వీలైనంత త్వరగా చట్ట రూపంలోకి తేవాలని తేవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. యూసీసీ బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇదే అంశంపై భేటీ కానుంది. అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు ప్యానల్ సభ్యులు. రాజకీయ, రాజకీయేతర వర్గాల అభిప్రాయాలు సైతం తెలుసుకోనున్నారు.
ఈ నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే అభిప్రాయసేకరణలో భాగంగా ‘లా కమిషన్’ ఒక నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసి.. అభిప్రాయసేకరణ ద్వారా వీలైనంత త్వరగా బిల్లు ఆమోదింపజేసుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది.
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన 31 సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ కానుంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల UCC గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
UCCపై భోపాల్లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అప్పటి నుంచి దీనిపై ముమ్మురంగా చర్చ జరుగుతోంది. బీజేపీ ఎన్నికల సమయంలో UCCపై హామీ ఇచ్చింది. అయితే.. ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్కు ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపగా, కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింసాకాండ వంటి సమస్యలు ఉన్నాయని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మండిపడుతున్నాయి.