Kali Mata : సహజంగా హిందూమతంలో ఆలయాల నిర్మాణంలోను వాస్తు పాటిస్తుంటారు. ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తుంటారు. కానీ తమిళనాడులోని తిరువక్కరై ఆలయంలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆలయం వాస్తు ప్రకారం నిర్మించలేదు . ధ్వజస్తంభం, బలి పీఠం, నంది , గర్భాలయం ఇవన్నీ ఒక వరుసలో ఉండవు. ఈ ఆలయాన్ని వక్ర కాళీ అమ్మన్ ఆలయంగా పిలుస్తున్నా ఇందులో మూడు ప్రధాన ఆలయాలు కనిపిస్తాయి. శివుడు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిగా కొలువయ్యారు. కాళీమాత , చంద్రమౌళీశ్వరునితో పాటుగా శ్రీ వరద రాజ స్వామీ వేరువేరు సన్నిధులలొ దర్శనమిస్తారు .ఏడు వినాయక విగ్రహాలు, ఆరుగురు ద్వార పాలకులు, మూడు నందులు, రెండు విష్ణు రూపాలు ఈ ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తుంటాయి. శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి త్రి ముఖాలతో కూడిన లింగ రూపంలో దర్శనమిస్తారు. విష్ణువు కూడా ప్రయోగచక్ర రూపంలో కటాక్షిస్తుంటారు.
పురాణాల ప్రకారం వక్రాసురుడ్ని వధించడానికి కాళీ మాత భూమిపై వెలిసిందట. ఉగ్రరూపంలో ఇక్కడ అమ్మవారు వెలిశారు. శని వక్రదశలో ఉన్నప్పుడు ఈ అమ్మవారిని కొలిస్తే సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందని చెబుతారు. వక్రకాళీ మాత రూపంలో అమ్మవారు రాజయోగాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రత్యేకించి రాజకీయ నాయకులు వక్రకాళీ మాతను దర్శించి పూజలు చేస్తుంటారు. అమ్మవారి ఉగ్ర తత్వాన్ని కట్టడి చేసేందుకు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి పాదాల దగ్గర శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారట.
9వ శతాబ్దం నాటి ఈఆలయంలో అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. లింగరూపంలో శివుడు మూడు ముఖాలతో దర్శనిమిచ్చే ఆలయం కూడా ఇదే. శివుడు, విష్ణువు, ఆదిపరాశక్తి మూడు ఒకే చోట ఉండే ప్రాంతం తిరువక్కరై ఆలయం. అందుకే ప్రతీ ఏటా వేలాదిమంది భక్తులు చంద్రమౌళీశ్వరుని ఆలయ దర్శనానికి దేశ విదేశాల నుంచి వస్తుంటారు. కాళీ మాత ఉండటంతో ఎక్కువమంది అఘోరాలు ఈ ఆలయానికి వస్తుంటారు.