Guru Purnima 2023 : ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించే వ్యక్తి గురువు. లౌకికమైన విషయాలు కాకుండా ఆధ్యాత్మికమైన విషయాలూ చెప్పేవారిని గురువుగా భావించాలంటోంది శాస్త్రం. ఆ గురువుల్ని స్మరించుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోజు వ్యాస పౌర్ణమి. ఆషాఢమాసంలో పౌర్ణమి రోజును గురు పౌర్ణమి లేదా, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. జీవితంలో ఎవరికైనా ముగ్గురు గురువులు ఉంటారు. మొదటి జగద్గురువు శ్రీకృష్ణపరమాత్ముడు . రెండో జగద్గురువు వ్యాసమహర్షి, అష్టాదశ పురాణాలు, వేదాలను విభజించి బ్రహ్మ సూత్రాలను రచించి లోకానికి ఎంతో ఉపకారం చేశారు. మూడో గురువు ఆదిశంకరాచార్యులు.
గురుపౌర్ణమి నాడు చేయాల్సిన కార్యక్రమం వ్యాస పూజ మాత్రమే. ఈరోజుల్లో అది తప్ప మిగిలినవి అన్నీ చేస్తుంటారు. కంచి లాంటి పీఠాల్లో కూడా వ్యాస మహర్షినే గురువుగా పూజిస్తారు. పరంపర లేని వారిని గురువులుగా గుర్తించాల్సిన అవసరం లేదని పెద్దలు చెబుతున్నారు. వైదికమైన సంస్కారం ఉన్న వారిని మాత్రమే గురుపౌర్ణమి రోజు ఆరాధించాలి. వేదంత జ్ఞానం కలిగిన వారు వేదాంతాలను చదివిన వారు మాత్రమే గురువుగా భావించాలంటున్నారు. వ్యాస పౌర్ణమి రోజు వ్యాస పూజ మాత్రమే చేయాలి. ఇంట్లో పూజగదిలో వ్యాసపీఠం మీద రామాయణం లేదా మహాభారతం లేదా భాగవతాన్ని పెట్టి వ్యాస మహర్షి ఫోటో పెట్టుకుని షోడశోపాచార పూజ నిర్వహించాలి. పరమాత్ముడి అష్టోత్తరాన్ని పఠించాలి.
వ్యాస పూజ తర్వాత మనకు వేదాన్ని , ఆధ్యాత్మిక విద్యను , ఉపనిషత్తులను ఉపదేశించిన వారిని పూజించాలి. గురు పూజ తర్వాత గురువు నుంచి ఏదైనా ఉపదేశం పొందాలని పెద్దలు చెబుతున్నారు. అలా గురువు లేని వారు వ్యాసపీట పెట్టుకుని వ్యాస భగవానుడ్ని పూజిస్తే సరిపోతుంది. ఇంటి యజమానితోపాటు కుటుంబ సభ్యులు కూర్చుని ఇంట్లో ఉండే పెద్దవాళ్లకి గురుపూజ చేయవచ్చు. శాస్త్రం ప్రకారం తండ్రే మొదటి గురువు. అందుకే తండ్రికి పూజ చేయాలంటోంది. తండ్రి రుణం తీర్చుకోలేనిది. మనకి మాట, నడక, నడత నేర్పిన మొదటి గురువును పూజించాలి. తర్వాత ఆధ్యాత్మికతను చెప్పిన గురువును పూజించాలి. గురు పూజ తర్వాత శ్రీ కృష్ణుడు , విష్ణు భగవానుడి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవచ్చు.