Balagam movie : కొన్ని సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కపోయినా, గుర్తింపు ఉన్న దర్శకుడు తెరకెక్కించకపోయినా హిట్ అవుతాయి. కేవలం హిట్ మాత్రమే కాదు.. సినీ పరిశ్రమ అంతా తమ వైపు తిరిగి చూసేలా చేస్తాయి. ఇక 2023 మొదలయినప్పటి నుండి టాలీవుడ్లో డెబ్యూ డైరెక్టర్ల హవా కొనసాగుతోంది. అలా తొలిసారి మైక్రోఫోన్ పట్టుకొని ‘బలగం’ అనే చిత్రంతో అందరినీ ఇంప్రెస్ చేశాడు వేణు. ఇక ఈ సినిమా సాధించుకున్న ఎన్నో అవార్డులు, రివార్డుల్లో తాజాగా మరొకటి యాడ్ అయ్యింది.
వేణు యెల్దండి.. ఇతడి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా ఎంతో గుర్తింపును అందుకున్నాడు వేణు. పలు సినిమాల్లో వేణు నటనకు ప్రేక్షకులు విపరీతంగా ఇంప్రెస్ అయిపోయారు కూడా. ఇక జబర్దస్త్ అనే ఒక కామెడీ షో ద్వారా తను బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యాడు. అలాంటి వేణు.. దర్శకుడిగా మారుతున్నాడంటే ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అనూహ్యంగా తను తెరకెక్కించిన సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
బలగం చిత్రానికి ఇప్పటికే ఎన్నో ప్రెస్టేజియస్ అవార్డులు వచ్చాయి. ప్రియదర్శి యాక్టింగ్కు, కొమురయ్య క్యారెక్టర్కు, పాటలకు, తెలంగాణ నేటివిటీకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఇది ప్రేక్షకులకు చాలా దగ్గరయిన సినిమా అని సినీ నిపుణులు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. అందుకే కొన్నిరోజుల క్రితం జరిగిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ‘మార్చి 2023 లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం మూవీకి ఏ విభాగంలో పురస్కారం లభించింది? అనే ప్రశ్న అడిగారు. తాజాగా మరో పబ్లిక్ ఎగ్జామ్లో బలగం గురించి ప్రశ్న రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
తాజాగా జరిగిన గ్రూప్ 4 పరీక్షల్లో బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. ‘బలగం చిత్రానికి సంబంధించిన క్రింది జతలలో ఏవి సరిగా జతపరచబడినవి? అనే ప్రశ్నకు ఏ. దర్శకుడు : వేణు యెల్దండి, బి. నిర్మాత : దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి సి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, డి. కొమురయ్య పాత్రను పోషించినవారు : అరుసం మధుసూదన్.’ అనే ప్రశ్న గ్రూప్ 4 లాంటి పరీక్షల్లో రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటూ వేణు స్వయంగా ట్విటర్లో తన సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. నేచురల్గా తెరకెక్కే సినిమాలు ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటాయని బలగం మరోసారి నిరూపించింది.